శ్రీవాణి టికెట్లపై టీటీడీ స్పష్టత
కలియుగ వైకుంఠం తిరుమలను కూటమి ప్రభుత్వం దళారులు, తమ తాబేదార్లకు వందల కోట్ల దందా కేంద్రంగా మార్చేసిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీటీడీ ఆన్లైన్ ఐటీ వ్యవస్థ లోపాలను, విఐపీ బ్రేక్ దర్శనాల వెనుక జరుగుతున్న వందల కోట్ల బ్లాక్ మార్కెట్ దందా జరుగుతోందని విమర్శించారు. వైఎస్ జగన్ హయాంలో హైందవ ధర్మ రక్షణ కోసం తెచ్చిన 'శ్రీవాణి ట్రస్ట్' ఆన్లైన్ టికెట్లను కేవలం ఒక్క నిమిషంలోనే మాయం చేస్తూ కూటమి నేతలు రూ. 48 కోట్ల పచ్చిదోపిడీకి పాల్పడ్డారని మండిపడ్డారు.
ఈ ఆరోపణలపై టీటీడీ స్పందించింది. టికెట్ల జారీ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించింది. భూమన కరుణాకర్ రెడ్డి చేసిన విమర్శలను తిప్పి కొట్టింది. టీసీఎస్ సహకారంతో 2019 మేలో మొదలుపెట్టిన ఆన్ లైన్ శ్రీవాణి టికెట్ విధానాన్నే కొనసాగిస్తోన్నామని, భక్తుల విజ్ఞప్తి మేరకు ఆఫ్ లైన్ ద్వారా తిరుమలలో ఏరోజుకారోజు జారీ చేసే విధానాన్ని మార్పు చేశామని గుర్తు చేసింది. ముందు ఎవరైతే సాప్ట్ వేర్ అప్లికేషన్ యాక్సెస్ చేస్తారో వారికే టికెట్ వచ్చే విధంగా ఈ ప్రక్రియను రూపొందించినట్లు వివరించింది.

మొదటి ఒకటిన్నర నిమిషంలోపే ముందు వచ్చిన వారికి ముందు ఇచ్చే విధానంలో లాక్ చేస్తోన్నామని టీటీడీ పేర్కొంది. అనంతరం పేమెంట్ గేట్ వే లో డబ్బులు చెల్లించినవారికే టికెట్లు అందజేస్తోన్నామని, డబ్బులు కట్టని భక్తుల టికెట్లను తిరిగి పూల్లోకి తీసుకొస్తోన్నామని, ఈ ప్రకియ ఐఆర్సీటీసీ, ప్రభుత్వ ఇతర అడ్వాన్స్ బుకింగ్ సర్వీసుల్లో కూడా అందుబాటులో ఉందని టీటీడీ తెలిపింది. ఈ విధానంలో మానవ ప్రమేయం ఏమీ లేదని, సిస్టమ్ ఆటోమేటిక్ గా పని చేస్తుందని పేర్కొంది.
10 నిమిషాల తర్వాత టకెట్లు జారీ చేయడం వాస్తవమేనని, పేమెంట్ చెల్లింపు సమయంలో సాంకేతిక లోపం లేదా ఇతర కారణాల వల్ల టీటీడీకి డబ్బు జమ అయినట్లు మెసేజ్ రాకుంటే అలాంటి టికెట్లను తిరిగి పూల్ లోకి తీసుకొచ్చి భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చేలా సాఫ్ట్ వేర్ అభివృద్ధి చేశామని, అందువల్ల ఆ జాప్యం ఉందని వివరణ ఇచ్చింది.
జీఎం ఐటీగా కనీస అర్హతలు లేని వ్యక్తిని నియమించారని చెప్పడం వాస్తవ విరుద్ధమని టీటీడీ తెలిపింది. ఎంటెక్ (కంప్యూటర్ సైన్స్), ఎంఎస్ (ఇన్నర్మేషన్ సిస్టమ్స్) చదివిన అధికారి జీఎంగా ఉన్నారని, 32 సంవత్సరాలుగా ఐటీలో సుదీర్ఘ అనుభవం ఉండటంతో స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్ కింద వారిని జీఎం ఐటీ పూర్తిస్థాయి అదనపు ఇన్ ఛార్జీగా మాత్రమే కొనసాగుతున్నారని స్పష్టం చేసింది.
2019 లో అమలు చేసిన సాప్ట్ వేర్ నే వినియోగంలో ఉంచి ఎప్పటికప్పుడు భక్తుల నుండి వచ్చే సలహాలు, సూచనల మేరకు కాలానుగుణంగా టీసీఎస్ ద్వారా అందులో మార్పులు చేస్తోన్నట్లు టీటీడీ పేర్కొంది. భక్తుల సౌకర్యార్థం టీటీడీ ఆటో ఫిల్లింగ్, కాపీ,పేస్ట్ ప్రక్రియ విధానాలను పూర్తిగా రద్దు చేసి అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తోందని, అన్ని వ్యవస్థలను కూడా ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ద్వారా ప్రతి సంవత్సరం ఆడిట్ చేయిస్తోన్నామని తేల్చి చెప్పింది.












Click it and Unblock the Notifications