దేవాదాయ భూములపై ఆదాయం వచ్చేలా మంత్రి సురేఖ మాస్టర్ ప్లాన్
తెలంగాణా రాష్ట్రంలో దేవాదాయ శాఖ భూములను పరిరక్షించటం కోసం మంత్రి కొండా సురేఖ అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. దేవాదాయ శాఖ భూములు అన్యాక్రాంతం అవుతున్న క్రమంలో వాటిని కాపాడటం కోసం కొండా సురేఖ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కబ్జాలకు గురైన దేవాదాయ శాఖ భూములను రక్షించటంతో పాటు, ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
దేవాదాయ శాఖ ఆదాయం పెంచేలా నయా ప్లాన్
దేవాలయ భూములు కబ్జా చేసేవారిపై పీడీ యాక్ట్ నమోదు చేఇస్తున్నారు. ఇదే సమయంలో దేవాదాయ శాఖ ఆదాయాన్ని పెంచేలా కొత్త ప్లాన్ కూడా చేశారు మంత్రి కొండా సురేఖ. దేవాదాయ శాఖ భూములు కబ్జాలకు గురి కాకుండా సోలార్ పవర్ ప్రాజెక్ట్ లను ఏర్పాటు చెయ్యాలని, ఉత్పత్తి అయిన పవర్ ను డిస్కం లకు అమ్మటం ద్వారా దేవాదాయ శాఖకు ఆదాయం ఆర్జించవచ్చని భావిస్తున్నారు.

ప్రభుత్వం దృష్టికి ప్రతిపాదన, సీఎం, భట్టి గ్రీన్ సిగ్నల్
ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుపయోగంగా ఉన్న దేవాదాయ శాఖ భూములలో సోలార్ పవర్ ప్లాంట్ లు ఏర్పాటు చేయాలని ప్లాన్ చేసిన మంత్రి కొండా సురేఖ ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లారు.
విద్యుత్ శాఖ నుండి సోలార్ ప్లాంట్ ల ఏర్పాటుకు సహకారం ఇస్తామన్న మంత్రి భట్టి
దీంతో వరంగల్ లో పర్యటించిన క్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ విషయాన్ని ప్రస్తావించి, విద్యుత్ శాఖ నుండి సోలార్ ప్లాంట్ ల ఏర్పాటుకు కావలసిన సహాయ సహకారాలు అందిస్తామన్నారు. దీనివల్ల దేవాదాయ శాఖ భూములు కబ్జాకు గురి కాకుండా ఉంటాయని, ఆలయ భూముల పైన ఆదాయం వచ్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అంతేకాదు కేంద్రం నుండి అందుతున్న పీఎం కుసుమ్ పథకం ద్వారా లబ్ది జరుగుతుందని భావిస్తున్నారు.
ఆలయాల భవనాల పైన రూఫ్ టాప్ సోలార్ యూనిట్లు
రాష్ట్రం సోలార్ వినియోగంలో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందని భావించారు. దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న ఆలయాల వద్ద ఉన్న భవనాల పైన రూఫ్ టాప్ సోలార్ యూనిట్లు ఏర్పాటు చేయాలని ఇప్పటికే మంత్రి కొండ సురేఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో విద్యుత్ కొరత లేకుండా, ఇదే సమయంలో ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా మంత్రి కొండా సురేఖ తీసుకున్న నిర్ణయం సత్య ఫలితాలను ఇస్తుందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications