నేటి నుంచే అమరావతి రైతుల పాదయాత్ర - వైసీపీ మినహా అన్ని పార్టీలు- రూట్ మ్యాప్ ఇలా..!!
ఏపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా..రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ అమరావతి జేఏసీ పాదయాత్ర చేపడుతోంది. తొలుత పోలీసులు అనుమతి నిరాకరించటంతో కోర్టుకు వెళ్లిన అమరావతి జేఏసీ అక్కడ అనుమతి సాధించింది. షరతులతో కూడిన అనుమతులను కోర్టు మంజూరు చేసింది. 'న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు' పేరుతో ఈ యాత్ర నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు నుంచి తిరుమల వరకూ పాదయాత్ర చేయనున్నారు.
యాత్ర నిర్వహణకు ప్రత్యేక కమిటీలు
ఈయాత్ర సజావుగా సాగేందుకు రైతులు 20 కమిటీలు ఏర్పాటు చేసి, వాటికి బాధ్యులను నియమించుకున్నారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు 684 రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. ఇప్పటివరకు 29 గ్రామాలకే పరిమితమైన ఈ పోరాటం.. పాదయాత్ర ద్వారా ఇతర ప్రాంతాల్లో తమ ఆవేదన వివరించాలనేది జేఏసీ నేతల అభిప్రాయంగా తెలుస్తోంది. యాత్రలో శ్రీవారి విగ్రహం ఉంచిన వాహనం ముందు వరసలో, ఆ తర్వాత కళాకారుల బృందాలు, మహిళలు, రైతులు, పాదయాత్రకు మద్ద తు తెలిపేవారు ఇలా వరుస క్రమంలో సాగుతారు. యాత్రలో పాల్గొనేవారి జాబితా సిద్ధమైంది.
యాత్ర షెడ్యూల్ ఇలా
పాదయా త్ర రోజూ రెండు విడతలుగా ఉదయం 6నుంచి 11గంటల వరకు సాయంత్రం 4నుంచి 6గంటల వరకు దాదాపు 12 నుంచి 14 కిలోమీటర్లు చొప్పున సాగనుంది. మొదటి 6రోజులు గుంటూరు జిల్లాలో సాగి.. పర్చూరు వద్ద ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించనుంది. నవంబరు 8నుంచి 17వరకూ పదిరోజుల పాటు ప్రకాశంలో సాగనుంది. 18న కావలికి చేరుకుంటుంది. ఈ జిల్లాలో 16రోజులపాటు సాగిన అనంతరం డిసెంబరు 4న చిత్తూరులోకి ప్రవేశిస్తుంది. అదేనెల 15 న తిరుమలకు చేరుకునేలా రూట్ మ్యాప్ సిద్దం చేసారు.
వైసీపీ మినహా అన్ని పార్టీల మద్దతు
ఇక, ఈ మహాపాదయాత్రకు టీడీపీ, జనసేన, బీజేపీ, సీపీఐ, సీపీఎం, ఆమ్ఆద్మీ, ఇతర రాజకీయ పక్షాలతో పాటు బహుజన ఫ్రెంట్ మద్దతు తెలిపాయి. టీడీపీ సోషల్ మీడియా ఐ-టీడీపీ ప్రతినిధులు పాల్గొంటున్నారు.తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన ప్రొఫెసర్ కోదండరాం మహాపాదయాత్రకు మద్దతు ప్రకటించారు. విజయవాడలో ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఆయనను రైతులు ఆదివారం కలిశారు. ఏదో ఒకరోజు పాదయాత్రలో పాల్గొంటానని కోదండరాం వారికి హామీ ఇచ్చారు.
Recommended Video
మరోసారి రాజకీయ చర్చగా మూడు రాజధానులు
ప్రభుత్వం - రైతుల మధ్య అంగీకారంతోనే 33వేల ఎకరాలు సేకరించారు. ఇప్పుడు ఏకపక్ష నిర్ణయాలు తగదు. ప్రభుత్వం రైతులతో చర్చలు నిర్వహించాలి'' అని కోదండరాం సూచించారు. ఇదే సమయంలో ఎక్కడా ఈ యాత్ర ద్వారా సమస్యలు తలెత్తకుండా యాత్ర మొత్తం వీడియో తీయాలని అన్ని జిల్లాల పోలీసు అధికారులను డీజీపీ ఆదేశించారు. ఎక్కడా ఎటువంటి ఉద్రిక్తతకు అవకాశం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈ యాత్రకు రాజకీయ పార్టీల నేతలు సైతం మద్దతు ఇస్తుండటంతో..ఈ వ్యవహారం మరో సారి రాజకీయంగా చర్చకు కారణమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇదే సమయంలో వైసీపీ నేతలు సైతం దీని పైన ఏ రకంగా రియాక్ట్ అవుతారో చూడాలి.