అమరావతి భూ కుంభకోణం .. ఆర్కే ఫిర్యాదు అభూతకల్పనే : ఆధారాలతో చూపించి ధూళిపాళ్ళ ఫైర్
అమరావతి భూములలో అక్రమాలు జరిగాయని, ఎస్సీల భూములను బెదిరించి లాక్కున్నారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సిఐడీకి చేసిన ఫిర్యాదుపై టిడిపి నేత దూళిపాళ్ల నరేంద్ర కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి భూముల క్రయవిక్రయాల పై ఎమ్మెల్యే ఆర్కే తప్పుడు ఫిర్యాదు చేశారని ఆయన మండిపడ్డారు.
అమరావతిలో రాజధాని ఉండడం ఇష్టం లేదని ధైర్యంగా చెప్పకుండా తప్పుడు కేసులు పెట్టే స్థాయికి సీఎం దిగజారారని దూళిపాళ్ల నరేంద్ర కుమార్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
అమరావతిపై జగన్ విషం కక్కుతున్నారు .. వాటికి జగన్ రెడ్డే బ్రాండ్ అంబాసిడర్ : పంచుమర్తి అనురాధ
చంద్రబాబుపై ఫిర్యాదులో అభూత కల్పనలు చేశారు
మంగళగిరి లోని పార్టీ కార్యాలయంలో మాట్లాడిన దూళిపాళ్ల నరేంద్ర కుమార్ రాజధాని అమరావతిని తరలించడం కోసం పెద్ద కుట్ర చేస్తున్నారని, అందులో భాగంగానే ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. సీఎం జగన్ తో పాటు వైసీపీ నేతలు, పోలీసులే ఇందులో పాత్రధారులు, సూత్రధారులు అని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై ఆళ్ల రామకృష్ణా రెడ్డి , సిఐడి అధికారులకు చేసిన ఫిర్యాదు నేపథ్యంలో అభూత కల్పనలు సృష్టించారని, వారు పేర్కొన్నట్టు ఎస్సీలు బాధితులు ఎవరూ లేరని నరేంద్ర కుమార్ స్పష్టం చేశారు.
ఫిర్యాదుదారులుగా పేర్కొన్న వారు ఎవరూ కేసులు పెట్టలేదు
ఇదే సమయంలో సిఐడికి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేసిన ఫిర్యాదులో పేర్కొన్న కందా పావని, ఈపూరి సుబ్బమ్మ, అద్దేపల్లి సాంబశివరావు తదితరులు తాము ఎలాంటి కేసు పెట్టలేదని చెప్పారని , విచారణ పేరుతో తమ వద్దకు కొందరు వచ్చారని, భూమిని అమ్మారా లేదా అని నిర్ధారించుకుంటున్నామంటూ సంతకాలు
పెట్టించుకున్నారని , ఆ సంతకాలతో కేసులు పెడుతున్న విషయం తమకు తెలియదని వారు చెప్పారని ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ వైసీపీ సర్కార్ పై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
ఫిర్యాడుదారులుగా పేర్కొన్న వారి వీడియోలను ప్రదర్శించిన ధూళిపాళ్ళ
కందా పావని, ఈపూరి సుబ్బమ్మ, అద్దేపల్లి సాంబశివరావులకు మాయమాటలు చెప్పి సంతకాలు సేకరించారు అంటూ వారు మాట్లాడిన వీడియోలను మీడియా ముందు ప్రదర్శించారు.
అమరావతి భూముల వ్యవహారంలో ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబుకు , మాజీ మంత్రి నారాయణకు నోటీసులు ఇచ్చిన సిఐడి అధికారులు విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు. ఇక ఈ నోటీసులను హైకోర్టులో సవాల్ చేసిన చంద్రబాబు విచారణకు హాజరు కాకుండా కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు.
చంద్రబాబుపై ఫిర్యాదుపై టీడీపీ నేతల పోస్ట్ మార్టం .. జగన్ కుట్ర అని ఫైర్
ఈ సమయంలోనే అమరావతి ప్రాంత రైతులు ఫిర్యాదు చేసినట్లుగా నమోదైన కంప్లైంట్ పై టిడిపి నేతలు పోస్టుమార్టం నిర్వహించారు. అందులో భాగంగానే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఈరోజు ఫిర్యాదుదారులుగా పేర్కొన్న వారు వీడియోలతో మీడియా ముందుకు వచ్చారు. ఇదంతా ఏపీ సీఎం జగన్, వైసీపీ నేతలు చేస్తున్న కుట్రగా విరుచుకుపడ్డారు.