అమరావతిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అన్ని హంగులతో క్వార్టర్లు!
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం నిర్మిస్తున్న నివాస భవనాలు త్వరలోనే సిద్ధం కానున్నాయి. ఇక ఈ విషయాన్ని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఈ భవనాలను పరిశీలించిన ఆయన, పనులు దాదాపు పూర్తి దశలో ఉన్నాయని, ఇంటీరియర్ పనులు త్వరగా ముగించి రెండు మూడు వారాల్లో జీఏడీ శాఖకు అప్పగించనున్నట్లు తెలిపారు.
జరుగుతున్న పనులన్నీ వేగంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు సూచన
మంత్రి నారాయణ అమరావతిలోని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్వార్టర్లను సందర్శించి ఈ మేరకు సమీక్షించారు. ప్రస్తుతం జరుగుతున్న పనులన్నీ వేగంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు. మంత్రులు, ఉన్నత అధికారుల క్వార్టర్స్ నిర్మాణం కూడా చివరి దశకు చేరుకుందని, గ్రూప్-1, గ్రూప్-2 అధికారుల టవర్ల పనులు సైతం వేగంగా ముగిస్తామని ఆయన వెల్లడించారు.

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం 288 అత్యాధునిక ఫ్లాట్లు
అమరావతిలో మొత్తం 12 టవర్లలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం 288 అత్యాధునిక ఫ్లాట్లు నిర్మాణం జరుగుతున్నాయి. ఈ ఫ్లాట్లు ఆధునిక సౌకర్యాలతో కూడుకుని ఉంటాయి. స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్, ఆస్పత్రి సౌకర్యాలు, అత్యాధునిక భద్రతా వ్యవస్థలు వంటి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. అసెంబ్లీ స్పీకర్ ఐయ్యన్నపాత్రుడు కూడా ఇటీవల ఈ పనులను పరిశీలించి అధునాతన సౌకర్యాలు ఉండేలా చూడాలని సూచించారు.
2027 ఆగస్టు నాటికి అమరావతి ఐకానిక్ టవర్ల నిర్మాణం పూర్తి చెయ్యాలని లక్ష్యం
అమరావతి ఐకానిక్ టవర్ల నిర్మాణం 2027 ఆగస్టు నాటికి పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నామని కూడా మంత్రి నారాయణ తెలిపారు. రాజధాని అభివృద్ధి పనులు రాష్ట్రంలోనే కాక పొరుగు రాష్ట్రాల్లో కూడా చర్చనీయాంశమవుతున్నాయన్నారు. రైతులకు ల్యాండ్ పూలింగ్ ద్వారా ప్లాట్లు అందజేస్తున్నామని, కొంతమంది రైతుల విషయంలో న్యాయపరమైన సమస్యలు ఉన్నాయని వివరించారు.
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అమరావతిలోనే
ఇటీవల అమరావతి నిర్మాణ పనుల కోసం రూ.524.70 కోట్లు అనుమతులు మంజూరు చేశామని, పెండింగ్లో ఉన్న పనులన్నీ వేగంగా పూర్తి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ క్వార్టర్లు సిద్ధమైతే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అమరావతిలోనే నివసించడం సాధ్యమవుతుంది. రాజధాని అభివృద్ధి దిశగా ఏపీ ప్రభుత్వం చేపట్టిన ఈ చర్యలు రాజకీయ, పరిపాలనా రంగాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. అమరావతి పూర్తి స్థాయి రాజధానిగా ఆవిర్భవించడానికి ఈ పనులు మైలురాయిగా నిలువనున్నాయి.













Click it and Unblock the Notifications