రాజమండ్రిలో తీవ్ర ఉద్రిక్తత!!
అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని ఆ ప్రాంత రైతులు, మహిళలు చేస్తున్న పాదయాత్రలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాజమండ్రి నగరంలో పాదయాత్ర కొనసాగుతున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు రైతులపై మంచినీళ్ల సీసాలు విసిరారు. ఆజాద్ చౌక్ మీదగా శాంతియుతంగా రైతులు, అఖిలపక్ష నేతలు వెళ్తుండగా నల్లబెలూన్లు ప్రదర్శిస్తూ కొందరు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
ఒకవైపు అమరావతి రైతులు, మరోవైపు వైసీపీ కార్యకర్తలు పోటాపోటీ నినాదాలు చేసుకున్నారు. వీరందరినీ ఒక ప్రజాప్రతినిధి రెచ్చగొట్టి పంపించారని, దీనివల్లే వారు సీసాలు విసిరినట్లు తెలుస్తోంది. ఘటన జరుగుతున్న సమయంలో అక్కడే ఉన్న పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ ఘటనను ప్రతిపక్షాలకు చెందిన నేతలంతా ఖండించారు.
అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు, మహిళలు అసెంబ్లీ నుంచి అరసవెల్లి వరకు 60 రోజులపాటు సుదీర్ఘ పాదయాత్రను గత నెల 12వ తేదీన ప్రారంభించారు. 36వరోజుకు రాజమండ్రి చేరుకుంది. అరసవెల్లిలోని శ్రీ సూర్యనారాయణస్వామి దేవాలయానికి చేరుకున్న తర్వాత తమ విన్నపాలను స్వామికి నివేదించడంతో యాత్ర ముగుస్తుంది. మొదటి విడతగా న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో హైకోర్టు నుంచి అలిపిరి వరకు 45రోజులపాటు యాత్ర చేశారు.
రెండో విడత యాత్రలో తమకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయని, పోలీసులు సహకరించడంలేదంటూ కొందరు రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. వీరి యాత్ర కొనసాగుతున్న సమయంలో విశాఖపట్నంలో మూడు రాజధానులకు మద్దతుగా 'విశాఖ గర్జన' పేరుతో సభ జరిగింది. అమరావతి రైతుల పాదయాత్రకు ఎవరూ ఎటువంటి అడ్డంకులు కలిగించొద్దంటూ డీజీపీ ఆదేశాలు జారీచేశారు.