Nara Lokesh : మంగళగిరితో పాటు మరో సీటుపై నారా లోకేష్ ఫోకస్ ? ఆర్ 5 జోన్ ఎఫెక్ట్ !
ఏపీలో 2019 ఎన్నికల్లో అమరావతిలోని మంగళగిరి నియోజకవర్గం అన్ని విధాలా సేఫ్ గా భావించి పోటీకి దిగిన టీడీపీ నేత నారా లోకేష్ కు చుక్కెదురైంది. ఈ ఎన్నికల్లో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో నారా లోకేష్ ఓటమిపాలయ్యారు. అయితే ఆ తర్వాత కూడా మంగళగిరి నియోజకవర్గాన్ని వదిలేయకుండా అక్కడే తిరిగి పోటీ చేసి గెలిచేందుకు లోకేష్ ప్లాన్ చేసుకుంటున్నారు. స్ధానిక సమీకరణాలు కూడా తనకు అనుకూలంగా మారుతున్నాయని భావిస్తున్న తరుణంలో మరో చిక్కు వచ్చి పడింది.
అమరావతిలో పేదలకు ఇళ్ల స్ధలాలు ఇచ్చేందుకు వీలుగా ఆర్ 5 జోన్ లో ప్లాట్లను కేటాయించేందుకు వైసీపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీనిపై హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్లి మరీ ఆదేశాలు తెచ్చుకున్న ప్రభుత్వం ఈసారి ఎలాగైనా పేదలకు ఇక్కడ పట్టాలు ఇచ్చి ఇళ్ల నిర్మాణం కూడా చేపట్టేందుకు ప్లాన్ రెడీ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్ 5 జోన్ వివాదం రాజకీయంగా కాక రేపుతోంది. మంగళగిరిలో నారా లోకేష్ కు కళ్లెం వేసేందుకే వైసీపీ సర్కార్ ఈ ఆర్ 5 జోన్ వివాదం తెచ్చినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో లోకేష్ కూడా అప్రమత్తం అయ్యారు.

మంగళగిరిలో తిరిగి పోటీ చేస్తే ఆర్ 5 జోన్ ఈసారి తన కొంప ముంచుతుందేమోనన్న ఆందోళన టీడీపీ నేత నారా లోకేష్ లో మొదలైందా అన్న చర్చ సాగుతోంది. అందుకే ఈసారి మరో నియోజకవర్గంపై కూడా ఆయన ఫోకస్ పెడుతున్నారని చెబుతున్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోనూ తాను పోటీ చేస్తే ఎలా ఉంటుందని లోకేష్ అధ్యయనం చేస్తున్నట్లు తెలుస్తోంది. మంగళగిరితో పాటు కళ్యాణదుర్గంలోనూ పోటీ చేసే అంశాన్ని లోకేష్ పరిశీలిస్తున్నట్లు సమాచారం.
అమరావతి ఆర్5 జోన్ ప్రభావం మంగళగిరిలో లోకేష్ పై ఉండే అవకాశం లేదని టీడీపీ నేతలు చెప్తున్నారు. కళ్యాణదుర్గంలో పోటీపై మాత్రం ఇంకా నోరు మెదపడం లేదు. కానీ వాస్తవానికి ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీకి ప్రధానంగా పట్టున్న జిల్లాల్లో ఒకటి. ఇక్కడ ఉండే బీసీ, కమ్మ సామాజిక వర్గాల ప్రభావం టీడీపీకి కలిసి వస్తోంది. గత ఎన్నికల్లో మాత్రం ఈ సమీకరణాలు తారుమారయ్యాయి. ఈ నేపథ్యంలో కళ్యాణదుర్గం సీటులో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి ఉషశ్రీ చరణ్ పై పోటీకి లోకేష్ సిద్ధమవుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. దీనిపై త్వరలో పూర్తి క్లారిటీ రానుంది.












Click it and Unblock the Notifications