13 జిల్లాల్లో అమరావతి అంతర్భాగం, మిగతా ప్రాంతాల మాదిరిగానే అభివృద్ధి: మంత్రి బొత్స సత్యనారాయణ
Recommended Video
ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు స్వలాభం కోసం పని చేస్తే జగన్ ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధి కోసం పాటుపడుతున్నామని హై పవర్ కమిటీ సభ్యులు, మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అమరావతి కూడా 13 జిల్లాల్లో భాగమేనని, అమరావతిని కూడా మిగతా ప్రాంతాలతో సమానంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. శనివారం హై పవర్ కమిటీ సమావేశమై నివేదికకు తుదిరూపు ఇస్తోందని తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డితో హై పవర్ కమిటీ భేటీ అయ్యాక బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు.

అండగా ఉన్నాం..
అమరావతి 29 గ్రామాల రైతులు ఉద్యమాని ఉపసంహరించుకోవాలని బొత్స సత్యనారాయణ సూచించారు. రాజధాని రైతులను అన్నివిధలా ఆదుకుంటామని భరోసానిచ్చారు. అమరావతిలో 25 శాతం పూర్తయిన భవన నిర్మాణాలను పూర్తి చేస్తామని చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు జరిగే సమయంలో అమరావతి వచ్చిన ఎమ్మెల్యేల విడిది కోసం ఆయా భవనాలను ఉపయోగిస్తామన్నారు.

మాయలో పడొద్దు
రైతులు చంద్రబాబు నాయుడు మాయలో పడొద్దని బొత్స సత్యనారాయణ సూచించారు. గత ప్రభుత్వ హయాంలో అమరావతి రాజధాని అని కనీసం నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని బొత్స చెప్పారు. కానీ తమ ప్రభుత్వం అన్నీ సవ్యంగా, పకడ్బందీగా పూర్తిచేస్తామని చెప్పారు. ప్రభుత్వం అధికారం చేపట్టిన 7 నెలల్లోనే సంక్షేమ పథకాలతో దూసుకెళ్తున్నామని చెప్పారు. నవరత్నాలు విడతలవారీగా అమలు చేస్తున్నారని బొత్స సత్యనారాయణ తెలిపారు.

ఇదీ విషయం
గత ప్రభుత్వ హయాంలో అమరావతి రాజధానిపై అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంగీకరించి, ఇప్పుడు రాజధానిని మారుస్తున్నారని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీనిపై బొత్స సత్యనారాయణ ఆ సమయంలో జగన్ ఏ విధంగా మాట్లాడారో క్లారిటీ ఇచ్చారు.

జగన్ ఏమన్నారంటే..
‘రాజధానిపై సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటన చేసినందున, తానేమి మాట్లాడాలి అని జగన్ చెప్పారు. రాజధాని కోసం 30 వేల ఎకరాల భూమి తీసుకున్నారు సరే.. కానీ అది ప్రభుత్వ భూమి అయితే బాగుండేది అని జగన్ ప్రస్తావించారు. రాజధానిపై తానేమైనా మాట్లాడితే ప్రాంతీయ విభేదాలు, అసమానతలు సృష్టించిన వాళ్లమవుతాం' అని జగన్ అసెంబ్లీలో ప్రసంగించారని బొత్స తెలిపారు. దీనిపై తాను ఒక్క మాట తప్పుగా మాట్లాడితే నిలదీయాలని మీడియా ప్రతినిధులను కోరారు.












Click it and Unblock the Notifications