ప్రస్టేషన్లో బాబు, టిటిడిపి కోసం ఏపి హక్కులు తాకట్టు: అంబటి ఫైర్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తీవ్రంగా మండిపడ్డారు. ప్రస్తుతం చంద్రబాబు తీవ్రమైన ఒత్తిడిలో మునిగిపోవడంతో న్యాయబద్ధమైన పాలన సాగడం లేదని విమర్శించారు. శనివారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఏపి పాలన అస్తవ్యస్థంగా ఉందని అన్నారు.
తుపాకీలు, లాఠీలతో పాలన కొనసాగించాలనుకుంటే సాధ్యం కాదని చెప్పారు. ప్రాజెక్టు విషయంలో నాడ దొరికిందని గుర్రాన్ని కొనేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇది చాలా ప్రమాదమని అన్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బతికించుకునేందుకు ఏపి హక్కులను తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు.
చంద్రబాబు ప్రధానంగా ఐదు ఫ్రస్టేషన్లతో ఇబ్బందిపడుతున్నారన్నారు. శేషాచలం ఎన్ కౌంటర్, రాజధాని నిర్మాణంపై కోర్టుల అడ్డంకులు, పట్టిసీమ, అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్నా ఒక్క హామీని కూడా నేరవేర్చకపోవడం వంటి వాటితో చంద్రబాబు ఇబ్బంది పడుతున్నారని అంబటి ఎద్దేవా చేశారు. ఆయన కుటుంబంలో కూడా ఏదో ఒక ఫ్రస్టేషన్ ఉందా అన్న అనుమానం తమలో కలుగుతుందన్నారు.
15 నుంచి బస్సు యాత్ర
రాష్ట్రంలోని ప్రాజెక్టుల స్థితిగతులు తెలుసుకునేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏప్రిల్ 15 నుంచి బస్సుయాత్ర చేపట్టనున్నట్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ తెలిపారు.
శనివారం పార్టీ కార్యాలయంలో జ్యోతుల నెహ్రూ మీడియాతో మాట్లాడుతూ.. రాజమండ్రి నుంచి 15వ తేదీ ఉదయం బస్సుయాత్ర ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఈ యాత్రలో జగన్మోహన్ రెడ్డితో పాటు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు, రైతు నాయకులు పాల్గొంటారని జ్యోతుల అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండ గట్టడం, రైతు సమస్యలు నేరుగా తెలుసుకోవడమే ఈ బస్సుయాత్ర ఉద్దేశమన్నారు.