టిడిపిది దౌర్జన్యం: అంబటి, బాబుకు రఘువీరా సవాల్
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల్లో అధికార టిడిపి విషసంస్కృతిని అమలు చేస్తోందని మండిపడ్డారు. రైతుల భూములను లాక్కునేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నవాళ్లు దౌర్జన్యాలు చేస్తున్నారని అంబటి రాంబాబు ఆరోపించారు. సరస్వతి సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు. దీనిపై అనవసర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
సరస్వతి సిమెంట్స్ భూములను తెలుగుదేశం పార్టీ నాయకులు కావాలనే వివాదస్పదం చేస్తున్నారని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. అవి పూర్తిగా కొనుగోలు చేసి, రిజిష్టర్ చేసుకున్న భూములను తెలిపారు.
బాబుకు రఘువీర సవాల్
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఏపి సిఎం చంద్రబాబు నాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన మేఘమథనంలో అవినీతి చోటుచేసుకుందంటూ చేసిన ఆరోపణలపై సిబిఐతో విచారణ జరిపించాలని బాబుకు సవాల్ విసిరారు. అనంతపురంలో ప్రముఖుల సమక్షంలో మేఘమథనంలో అవినీతి జరిగిందని చంద్రబాబు చేసిన ఆరోపణల్ని రఘువీరా ఖండించారు.