చంద్రబాబు కుట్ర..? చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించిన అంబటి రాంబాబు..
గుంటూరు జిల్లా చినకాకానిలో ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారుపై జరిగిన దాడిని వైసీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. దాడి ఘటనపై ఆ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పిన్నెల్లిపై దాడికి చంద్రబాబే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఒకప్పుడు పదవి కోసం ఎన్టీఆర్పై చెప్పులు వేయించిన చరిత్ర చంద్రబాబుది అని.. ఇప్పుడు పదవి కోల్పోయి తమ పార్టీ నేతలపై దాడులు చేయిస్తున్నాడని ఆరోపించారు.
భళారే భువనేశ్వరి.. మీ గురించి చెప్పుకోవాల్సిందే.. అంబటి సంచలన వ్యాఖ్యలు
అమరావతి ప్రాంత రైతుల ఉద్యమాన్ని రాష్ట్ర ప్రజలందరిపై రుద్దడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఎకరా రూ.30కోట్లు పలుకుతుందన్న లాభాపేక్షతో భూములు ఇచ్చినవారే ఉద్యమం పేరుతో రాద్దాంతం చేస్తున్నారని విమర్శించారు.రాష్ట్రంలో మూడు రాజధానులు వస్తే వారి రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతింటుందని భయం పట్టుకుందన్నారు. అందుకే ఉద్యమం అంటూ హింసకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఉద్యమం ముసుగులో హింసకు పాల్పడితే సహించేది లేదని తేల్చి చెప్పారు.
రైతులను ప్రభుత్వం పైకి ఉసిగొల్పి పబ్బం గడుపుకోవాలని చంద్రబాబు చూస్తున్నారని విమర్శించారు. ఇటీవలే ఓ టీవీ ప్రతినిధిపై దాడి చేయించారని.. ఇప్పుడు ఎమ్మెల్యే పైనే దాడి చేయించారని ఆరోపించారు. హింసతో రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించాలని చంద్రబాబు కుట్ర పన్నారని.. ఆ కుట్రలో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయని ఆరోపించారు. చంద్రబాబు చరిత్రంతా నేరమయమేనని వంగవీటి రాధను హత్య చేయించింది ఆయనే అని ఆరోపించారు. జర్నలిస్ట్ పింగళి దశరథరాం,ఓ ఐఏఎస్ హత్య కేసులోనూ చంద్రబాబు ప్రమేయం ఉందని ఆరోపించారు. చంద్రబాబు హింసకు కుట్రలు పన్నితే.. తామేమీ చూస్తూ కూర్చోబోమని హెచ్చరించారు.