16 నెలల జైలు- ఆస్తులు సీజ్ : అయినా జగన్ ముందుకే - అంబటి : కొడాలి నాని వస్తూనే..!!
రానున్న ఎన్నికల్లో తిరిగి ముఖ్యమంత్రిగా జగన్ ఎన్నికయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని మంత్రి అంబటి రాంబాబు ధీమా వ్యక్తం చేసారు. తనది కాని అధికారాన్ని లాక్కోవాలని..అనుభవించాలని చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. పార్టీ ప్లీనరీలో మంత్రి రాంబాబు తన ప్రసంగంలో చంద్రబాబు - దుష్టచతుష్ఠయం పైన ఫైర్ అయ్యారు. చంద్రబాబుతో యుద్ధం అయితే ఐదు నిమిషాల్లో పూర్తిచేస్తాం. చంద్రబాబుతో కాదు యుద్ధం.. ఆయన వెనుక ఉన్న దుష్టచతుష్టయంతో యుద్ధం చేస్తున్నామని చెప్పుకొచ్చారు. పేదవాడు చదువుకునే బడి, పేదవాడు వైద్యం చేసుకునే వైద్యశాలలు బాగుచేసిన మహానుభావుడు సీఎం జగన్ అని చెప్పుకొచ్చారు. బురదజల్లాలని ప్రయత్నం చేసే ఆ దుష్టశక్తులను ఎదుర్కోవడానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు

చంద్రబాబు కోసమే పవన్
ఎవరైనా అధికారంలోకి రావాలని పార్టీ స్థాపిస్తారని.. కానీ, ఒకాయన పార్టీ పెట్టాడు.. ఆయన అధికారంలోకి రావాల్సిన అవసరం లేదు.. చంద్రబాబు అధికారంలోకి రావాలి. ఆయనకు కావాల్సింది ప్యాకేజీ మాత్రమే. ఆయనే చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కల్యాణ్. దత్తపుత్రుడి అభిమానులు సీఎం.. సీఎం అంటున్నారు.. కానీ, దత్తపుత్రుడు ప్యాకేజీ తీసుకొని చంద్రబాబు సీఎం అంటున్నాడు. అలా అనేందుకు సిగ్గుండాలంటూ మండిపడ్డారు. వైఎస్సార్ మరణం తరువాత జగన్ పైన అనేక కుట్రలు - కుతంత్రలు చేసారన్నారు. 16 నెలలు జైల్లో నిర్బంధించారని.. ఆస్తులు సీజ్ చేసారని వివరించారు. ఆస్తులు పోయినా.. ప్రజలే నా ఆస్తి అని చిరునవ్వుతో బాధలను ఎదుర్కున్న వ్యక్తి సీఎం జగన్ అని చెప్పుకొచ్చారు.

ఈ రాష్ట్రానికి అవసరమా
బావురుమని ఏడ్చినవాడు ఈ రాష్ట్రానికి నాయకుడిగా పనికివస్తాడా అనేది ఆలోచన చేయాలని వ్యాఖ్యానించారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా.. వైసీపీని ఎవరూ ఏమీ చేయలేరని చెప్పారు. చంద్రబాబు సీఎంగా ఉంటే రాష్ట్రాన్ని దోచుకోవచ్చని దుష్టచతుష్ఠయం ఆలోచన అంటూ ఆరోపించారు. మాజీ మంత్రి కొడాలి నాని వేదిక మీదకు రాగానే.. సభికుల నుంచి పెద్ద ఎత్తున హర్షధ్వానాలు మారు మోగాయి. చంద్రబాబు మద్దతు మీడియా పైన కొడాలి నాని తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. వారిని చూసి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని.. జగన్ ఎవరికీ భయపడే వ్యక్తి కాదని చెప్పుకొచ్చారు.

చివరకు జగన్ కుమార్తె గురించీ
ఎవరూ చంద్రబాబు సతీమణిని ఏమీ అనలేదని.. రాజకీయంగా మైలేజ్ కోసం సొంత కుటుంబ సభ్యులను సైతం వాడుకోవటానికి వెనుకాడరని పేర్కొన్నారు. చివరకు జగన్ కుమార్తె పారిస్ లో డిస్టింక్షన్ లో పాస్ అయితే..తండ్రిగా సీఎం వెళ్తే విమానంలో వెళ్లారంటూ మాట్లాడుతున్నారని.. లోకేష్ కోసం అప్పట్లో చంద్రబాబు అమెరికాకు విమానంలో వెళ్లక.. నడుచుకుంటూ వెళ్లారా అంటూ కొడాలి నాని ప్రశ్నించారు. 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీ గెలుస్తుందని.. కానీ, కార్యకర్తలు అప్రమత్తంగా ఉంటూ పార్టీ కోసం పని చేయాలన్నారు. జగన్ ను సీఎంగా కొనసాగే విధంగా అందరం ఆయన్ను కాపాడుకోవాలని కొడాలి నాని పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications