చంద్రబాబు సరికొత్త ఎత్తుగడే ఇది...ఫైబర్ గ్రిడ్ పై అంబటి రాంబాబు ఆరోపణలు...
విజయవాడ : టెక్నాలజీ పేరిట ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుతో తెలుగుదేశం ప్రభుత్వం దారుణమైన మోసానికి పాల్పడుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. గురువారం విజయవాడలోని వైసిపి రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
Recommended Video

ఫైబర్ గ్రిడ్ పేరుతో చంద్రబాబు పెద్ద కుట్రకే తెరలేపారని వైసిపి సీనియర్ నేత అంబటి రాంబాబు ఆరోపించారు. ట్రాయ్ రూల్స్ ప్రకారం ఏ ప్రభుత్వ సంస్థ అయినా సరే ఇందులోకి రాకూడదని స్పష్టంగా నిబంధన ఉందన్నారు. కానీ, ఐపీ టీవీ రూపంలో ఈ రంగంలోకి దొడ్డిదారిలో ప్రవేశించాలని చంద్రబాబు చూశారన్నారు. పైగా హేరిటేజ్ పార్టనర్స్ ఇందులో భాగస్వాములు కాగా, ఇందుకోసం దుర్భుద్ధితో ఓ మెమోను కూడా జారీ చేశారని, ఏపీ ఎస్ఎఫ్ఎల్ తప్ప మిగతా ఎవరూ కూడా ఎలక్ట్రికల్, టెలిఫోన్ పోల్స్ మీద కేబుల్స్ వేయటానికి వీల్లేదనేదే ఆ మెమో సారాంశమని తెలిపారు. అలా చేస్తే పోలీసుల సహకారంతో అయినా తొలగించండి అని ఆదేశాలు జారీ చేశారని, ఇది ముమ్మాటికీ చట్ట విరుద్ధమైన ఆదేశం అని అంబటి ధ్వజమెత్తారు.

ఏ ప్రైవేట్ ఎమ్మెస్వో అయినా సొంతంగా కేబుల్ లైన్ వేసుకోలేరని అంబటి చెప్పారు. అయినా నిబంధనల ప్రకారం అయితే లైసెన్స్ తీసుకున్నవారు ఎవరైనా సరే పోల్ మీదుగా, అండర్ గ్రౌండ్ ఎక్కడైనా వేసుకోవచ్చని ఉందన్నారు. కానీ, ఈ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం నిబంధనలను తుంగలో తొక్కి కొత్త ఆదేశాలు జారీ చేసిందని, ఈ నిర్ణయం ద్వారా ఆపరేటర్లను తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోందని ఆరోపించారు. తద్వారా తమకు అనుకూలంగా లేని ఛానెళ్లపై వేటు వేయాలని ప్రయత్నిస్తోంది. అది ఖచ్ఛితంగా అప్రజాస్వామిక చర్యేనని ఆయన స్పష్టం చేశారు. ఇది చాలదన్నట్లు ఈ నిర్ణయాలను ప్రశ్నిస్తే.. టెక్నాలజీ వ్యతిరేకం.. అద్భుతాలకు అడ్డుపుల్ల వేస్తున్నారంటూ లోకేష్, చంద్రబాబులు వైసీపీపై ఆరోపణలు గుప్పిస్తున్నారన్నారు. మీరు చేసేది అద్భుతాలు కావు. మీడియా మీద నియంత్రణ కోసం చేసే నిరంకుశ యత్నాలు. టెక్నాలజీ ప్రజలకు అందాలి. కానీ, ఇది సరైన పద్ధతి కాదని అంబటి రాంబాబు దుయ్యబట్టారు.

భవిష్యత్తులో ముందడుగు కోసం ప్రైవేటీకరణ కరెక్ట్ కాదని, ఒకవేళ చేయాలనుకుంటే అందులో ప్రభుత్వ రంగ సంస్థ జోక్యం ఉండకూడదని అంబటి అన్నారు. ఈ నిర్ణయం ద్వారా కేబుల్ ఆపరేటర్ల వ్యవస్థ తీవ్రంగా దెబ్బ తింటుంది. వారి పొట్ట కొట్టినట్లువుతుంది. దీనికితోడు మళ్లీ సెటప్ బాక్సులు ఏర్పాటు చేసుకోవాలంటే వినియోగదారులపైనా భారం పడటం ఖాయం. అందుకే ఈ ఫైబర్ గ్రిడ్ వ్యవస్థకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం అని అంబటి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ విషయంలో గతంలో ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా స్టే ఆర్డర్లు తెచ్చుకున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసిన అంబటి రాంబాబు కేబుల్ ఆపరేట్లకు అండగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని భరోసా ఇచ్చారు.












Click it and Unblock the Notifications