పౌరుషం చూపించాల్సిన సమయమిది.. టీడీపీ వ్యవహారం సిగ్గుచేటు
ప్రత్యేక హోదా అనేది తెలుగు ప్రజల భవిష్యత్ పోరాటమని చెప్పిన వైసీపీ నేత అంబటి రాంబాబు.. స్వార్థ రాజకీయాల కోసం టీడీపీ ఏపీ ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతోందని విమర్శించారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ఉద్దేశమే ఉంటే టీడీపీ నేతలు తక్షణం కేంద్ర మంత్రి వర్గంలో నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు అంబటి. ప్రత్యేక హోదా లేకపోతే అభివ్రుద్దిలో రాష్ట్రం వెనకబడడం ఖాయమన్న ఆయన.. ప్రత్యేక హోదా మాత్రమే ఏపీకి కొత్త ఊపిరి పోయగలదని వ్యాఖ్యానించారు.
ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రం కుండబద్దలు కొట్టినా..! చంద్రబాబు నాయుడు ఇంకా వేచి చూసే ధోరణితో వ్యవహరించడం ఏపీకి పట్టిన దుర్గతి అన్నారు. హోదా ఇస్తామని చెప్పిన బీజేపీ, ప్రత్యేక హోదా తీసుకొచ్చేది మేమే అని చెప్పుకున్న టీడీపీ ప్రజలకు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారని నిలదీశారు. ప్రత్యేక హోదాపై తెలుగువారి ఆత్మగౌరవాన్ని, పౌరుషాన్ని చూపించాల్సిన సమయం ఆసన్నమైందని, చిత్తశుద్ది ఉంటే ఇప్పటికైనా చంద్రబాబు కేంద్రంపై ఉద్యమించాలని హితవు పలికారు.

ప్రత్యేక హోదాపై వెనుకడుగు వేసిన బీజేపీని విమర్శించొద్దని చంద్రబాబు ఇంకా కేంద్రాన్ని వెనుకేసుకొచ్చే ప్రయత్నం చేయడం సిగ్గుచేటు అన్నారు. చంద్రబాబు అవినీతి భాగోతాలు మోడీ, కేసీఆర్ చేతుల్లో ఉండడం వల్లే హోదాపై కేంద్రాన్ని నిలదీయలేకపోతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ తల్లిని చంపేస్తే బీజేపీ 20 నెలల బిడ్డను గొంతు నులిమేస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులపై అభ్యంతరాలను వ్యక్తం చేయడానికి కూడా వెనుకాడుతున్న చంద్రబాబు రైతులే స్వయంగా ఢిల్లీ వెళ్లి సుప్రీం కోర్టులో పిటిషన్ వేసుకునే పరిస్థితి తీసుకురావడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు.
చివరగా.. వైసీపీ అధినేత జగన్ ఈ నెల 13వ తేదీన తలపెట్టిన ప్రత్యేక హోదాపై ధర్నా కార్యక్రమాలను ప్రజలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కలెక్టరేట్ల ముందు చేపట్టబోతున్న ఈ ధర్నా రాజకీయాలకు అతీతంగా జరుగుతందని పెద్ద ఎత్తున జనం దీనికి మద్దతు పలకాలని విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications