ప్రభుత్వాన్ని ప్రశ్నించే నేతలపై చంద్రబాబు అస్త్రం: మండిపడ్డ అంబటి
హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? అన్న అనుమానం కలుగుతోందని వైసీపీ నేత అంబటి రాంబాబు ప్రశ్నించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఓటుకు నోటు కేసు భయంతోనే సచివాలయాన్ని తరలిస్తున్నారని ఆయన ఆరోపించారు.
చంద్రబాబు జారీ చేస్తున్న ప్రతి జీవో వెనుక అవినీతి కథ ఉందని ఆరోపించారు. హైదరాబాద్ లో అవినీతి చేస్తే తెలంగాణ పోలీసులకు పట్టుబడతారనే చంద్రబాబుకు హడావుడిగా అమరావతికి తరలిస్తున్నారని ఆరోపించారు. ఉద్దేశ్యపూర్వకంగా ఇటువంటి పరిస్థితి తీసుకురావడం బాధాకరమని వ్యాఖ్యానించారు.

రెండున్నరేళ్ల పాలనలో రాజధానిలో ఒక్క శాశ్వత భవనం కట్టారా? అని ప్రశ్నించారు. సింగపూర్, చైనా మీద అతిగా ఆధారపడుతున్నందు వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోన్న నేతలపై పీడీయాక్ట్ ప్రయోగిస్తామంటూ చంద్రబాబు బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు. భీమవరం సమీపంలో ఆక్వా ఫుడ్ పార్క్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పట్ల పోలీసులు వ్యహరించిన తీరు దారుణంగా ఉందని దుయ్యబట్టారు.
ప్రతిపక్షాలను అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇలాగే చంద్రబాబు తన ప్రయత్నాలను కొనసాగిస్తే ఆయన్ను ప్రజలే తరిమి కొడతారని అన్నారు. ఏపీ సచివాలయాన్ని హైదరాబాద్ నుంచి అమరావతికి తరలిచడంపై నిప్పులు చెరిగారు. పదేళ్లు పాటు హైదరాబాద్లో ఉండే అవకాశం ఉన్నా చంద్రబాబు ఎందుకు కార్యాలయాలను అమరావతికి తరలిస్తున్నారని ప్రశ్నించారు.
అయితే సచివాలయ తరలింపునకు తాము వ్యతిరేకం కాదని అన్నారు. ఉద్యోగులకు అరకొర వసతులతో తరలింపులు వద్దని ఆయన సూచించారు. హైదరాబాద్ పదేళ్ల పాటు ఉమ్మడి రాజధాని అని, ఈ కాల వ్యవధిలో నూతన రాజధాని అమరావతిలో అన్ని ఏర్పాట్లు చేసుకోవచ్చని సూచించారు.
హైదరాబాద్ నుంచి పాలన కొనసాగితే ఏదైనా నేరం జరిగినప్పుడు తెలంగాణ పరిధిలో విచారణ సాగుతుందని భయపడే ప్రభుత్వం అమరావతికి కార్యాలయాలను తరలిస్తోందని ఆయన ఆరోపించారు. పోలీసులు నిజాయితీగా వ్యవహరించాలని, ప్రభుత్వ ఒత్తిళ్లకు లొంగొద్దని కోరారు. దోమల మీద దండ్రయాత్ర కాదు అవినీతిపై దండయాత్ర చేయాలని చంద్రబాబుకు సూచించారు.
అమరావతిలో కూల్చివేతలు
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలోని వెలగపూడిలో నిర్మించిన తాత్కాలిక సచివాలయంలో కూల్చివేతలు మొదలయ్యాయి. ఒకటో బ్లాక్లో సీఎం కార్యాలయం, జీఏడీలో పలు గోడలు కూల్చి, కాంట్రాక్టర్లు మళ్లీ కడుతున్నారు. సీఎంకు నచ్చలేదని, వాస్తుకు తగ్గట్టు లేవన్న కారణాలతో వీటిని కూల్చివేస్తున్నారు.
గతంలో కూడా 4, 5 బ్లాకుల్లో ఈవిధంగానే పడగొట్టి, మళ్లీ నిర్మించారు. తాజా కూల్చివేతలతో తాత్కాలిక సచివాలయ నిర్మాణ ఖర్చు మరింతగా పెరగనుంది. ఇప్పటికే దీని నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 750 కోట్ల వరకు కేటాయించింది.












Click it and Unblock the Notifications