అందుకే చంద్రబాబు సాక్షిపై విరుచుకుపడుతున్నారు: అంబటి రాంబాబు
గుంటూరు: ఇసుక మాఫియా, పట్టిసీమ వ్యవహారాల్లో జరిగిన అవినీతిని బట్టబయలు చేస్తున్నది కాబట్టే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సాక్షి దినపత్రికపై విరుచుకుపడుతున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు అంబటి రాంబాబు అన్నారు. ఇసుక పాలసీపై శ్వేతపత్రాన్ని విడుదల చేసిన క్రమంలో చంద్రబాబు సాక్షిపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంపై ఆయన గురువారం మీడియా సమావేశంలో స్పందించారు.
వాస్తవాలను ప్రజల దృష్టికి తీసుకుని వెళ్లే పత్రికలపై చంద్రబాబు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని అన్నారు. చంద్రబాబు పత్రికలపై అసహనం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. కేవలం తమకు వ్యతిరేకించారనే చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్లు ఓ చానెల్ను ఏడాది పాటు నిలిపేసిన సందర్భాలు ఉన్నాయని అంబటి రాంబాబు అన్నారు.

ఒక పత్రికను చదవండి, మరో పత్రికను చదవొద్దు అని చంద్రబాబు చెప్పడం బాధాకరమని అన్నారు. ఏ పత్రిక చదవాలో, ఏది చదవకూడదు అనే పరిజ్జానం ప్రజలకు ఉందన్న విషయాన్ని చంద్రబాబు గుర్తించాల్సిన అవసరం ఉందని అన్నారు. అవినీతి, అక్రమాలు బట్టబయలు చేస్తుంటే ఓర్వలేక, తన బండారం బయటపడుతుందనే ఉద్దేశంతో చంద్రబాబు వ్యాఖ్యలు చేశారనే విషయం ప్రజలకు తెలుసునని రాంబాబు అన్నారు.
పత్రికల్లో వచ్చిన విషయాలు వాస్తవాలో కాదో చెప్పాల్సింది పోయి పత్రికలు చదవొద్దని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఓటుకు నోటు వ్యవహారంలో టీవీ చానెళ్లలో స్పష్టంగా వినిపించిన కంఠం మీది కాదా చంద్రబాబూ... అని ఆయన ప్రశ్నించారు. కేవలం స్వార్థం రాజకీయాల తెలంగాణలో సొంత తెలుగుదేశం పార్టీనే అమ్ముకున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
బిజెపి కాళ్ల వద్ద చంద్రబాబు తన పార్టీని తాకట్టు పెట్టారని ఆయన వ్యాఖ్యానించారు. తమ పార్టీ అధినేత చంద్రబాబుపై అవాకులు చవాకులు పెలితే సహించబోమని ఆయన హెచ్చరించారు. చంద్రబాబు నీతి వ్యాఖ్యలు చేస్తుంటే నవ్వుకుంటున్నారని అన్నారు. చంద్రబాబు ఇష్టానుసారం మాట్లాడితే పత్రికలే కాకుండా రాజకీయ పార్టీలు కూడా సహించబోవని రాంబాబు అన్నారు.












Click it and Unblock the Notifications