మంత్రులకి చెమట పట్టించిన సాక్షి, జగన్ 5 లక్షలు మంత్రులకే: అంబటి
విజయవాడ: ఏపీ రాజధాని అమరావతిలో ప్రపంచస్థాయి దోపిడీ జరుగుతోందని వైసిపి అధికార ప్రతినిధి అంబటి రాంబాబు బుధవారం ఆరోపించారు. వైసిపి అధినేత జగన్ 5 లక్షల ఎకరాలు కొనుగోలు చేశారన్న మంత్రుల వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు.
జగన్ 5 లక్షల ఎకరాలు కొనుగోలు చేసినట్లు నిరూపిస్తే వారికే రాసిస్తామన్నారు. మంత్రులు చేస్తోంది ప్రజాసేవ కాదని.. నారా లోకేష్ సేవ అని ఎద్దేవా చేశారు. భూదందా పైన విచారణకు సిద్ధమని మంత్రులు ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు.
రాజధాని పైన ఆదరబాదరాగా నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. చంద్రబాబు, మంత్రుల బినామీలకు మేలు చేసేందుకే అలా చేశారని ఆరోపించారు. రాజధాని విషయంలో శివరామకృష్షన్ కమిటీ నివేదికను పక్కన పెట్టారని ఆరోపించారు. రాజధాని భూదందా బాగోతం సాక్షి పత్రిక వెలుగులోకి తెచ్చిందన్నారు.
మంత్రులకు చెమటలు
సాక్షి కథనాలతో మంత్రులకు చెమటలు పడుతున్నాయన్నారు. రాజధాని భూదందా కథనం పైన మంత్రులు ఒత్తిడిలో ఉన్నారని చెప్పారు. సాక్షి పైన సివిల్, క్రిమినల్ కేసులు పెడతామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. సాక్షి పత్రిక ఆధారాలతో సహా రాసిందన్నారు. బినామీ వ్యవహారం బయటపెట్టిందన్నారు.
జగన్కు 5 లక్షల ఎకరాలు ఉంటే మంత్రులకే
మంత్రులకు రాజధాని పరిధిలో ఎలాంటి భూములు లేకుంటే విచారణకు సిద్ధపడవచ్చు కదా అని సవాల్ చేశారు. జగన్కు 5 లక్షల ఎకరాలు ఉన్నట్లు నిరూపిస్తే వారికే రాసిస్తామన్నారు. ప్రభుత్వం మీ చేతుల్లో ఉందని, విచారణ చేయించుకోవాలని సవాల్ చేశారు. అబద్దాలు చెప్పినా అతికినట్టు ఉండాలన్నారు.
రూ.20 కోట్లు ఇచ్చి కొన్నారు
మంత్రులు పత్తిపాటి నారాయణలు చెప్పేది నిజమే అయితే వారు తమ నిజాయితీని నిరూపించుకోవాలన్నారు. చంద్రబాబు తమ పార్టీకి చెందిన ఒక్కో ఎమ్మెల్యేకు రూ.20 కోట్లు ఇచ్చి కొనుక్కున్నారని ఆరోపించారు.
నారాయణకు ఏం సంబంధం.. బాబుతో క్యాష్ సంబంధం
రాజధాని భూసేకఱణతో మంత్రి నారాయణకు ఏం సంబంధమని ప్రశ్నించారు. ఆయన ఏమైనా రెవెన్యూ శాఖ మంత్రియా అని ప్రశ్నించారు. చంద్రబాబుకు, నారాయణకు క్యాష్ సంబంధముందని ఆరోపించారు. మొన్నటి ఎన్నికల సమయంలో చంద్రబాబుకు నారాయణ వేల కోట్లు ఇచ్చారని ఆరోపించారు. నారాయణ చేస్తోంది ప్రజా సేవ కాదని లోకేష్ సేవ అన్నారు. చంద్రబాబుకు ప్రజలు ఏదో ఓ రోజు బుద్ధి చెబుతారన్నారు.
సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి: రఘువీరా
సాక్షి కథనం పైన సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి అన్నారు. చంద్రబాబు చేసే భూమిపూజలు అన్నీ రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసమేనని ఆరోపించారు. సాక్షి పైన మంత్రులు ఎదురు దాడి చేసే బదులు సిబిఐ విచారణకు సిద్ధం కావాలన్నారు. సాక్షి పత్రిక రాసింది కేవలం పది శాతమే అన్నారు.