రాష్ట్రంలో రెండే రెండు బంగారు కుటుంబాలు.. అంబటి రాంబాబు సెటైర్లు
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును, అలాగే జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను వైసిపి నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు టార్గెట్ చేశారు. చంద్రబాబు పదేపదే సంపద సృష్టిస్తామని చెబుతున్నారని, ఈ తొమ్మిది నెలల పాలనలో ఎంత సంపద సృష్టించారో చెప్పాలని ఆయన పేర్కొన్నారు. వైసిపి ప్రభుత్వం పాలనలోని పథకాలకు కూడా పాతర వేశారని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసిన అంబటి రాంబాబు
చంద్రబాబు పి ఫోర్ పేరుతో ప్రజలందరిని ఏప్రిల్ ఫూల్ చేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వ పాలనలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని తేల్చి చెప్పారు. రాష్ట్రంలోని పేదలను మరింత పేదలుగా చేస్తున్నారంటూ అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండే రెండు బంగారు కుటుంబాలు ఉన్నాయన్న అంబటి రాంబాబు ఒకటి చంద్రబాబుది, మరొకటి పవన్ కళ్యాణ్ దని సెటైర్లు వేశారు.

లోకేష్ పైన తీవ్ర వ్యాఖ్యలు
లోకేష్ ను జనం మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారన్నారు. లోకేష్ డబ్బులు వసూలు చేసి పవన్ కళ్యాణ్ కు ఇస్తున్నారని, పవన్, చంద్రబాబు లోకేష్ ల నుండి ప్యాకేజీలు తీసుకుంటున్నారని విమర్శించారు. పుట్టినప్పటినుంచి చంద్రబాబు చేసినవన్నీ తప్పులేనని పేర్కొన్న అంబటి రాంబాబు ఎన్టీఆర్ దగ్గర పనిచేసి ఆయన పని పూర్తి చేశారని ఎన్టీఆర్ నే లేకుండా చేశారని విమర్శించారు.
ప్రైవేటీకరణ ఘనత చంద్రబాబుదే
గ్రామీణ ప్రాంతాలలో రోడ్లు, పోర్టులను ప్రైవేటుపరం చేస్తున్నారని ఆరోపించారు. మెడికల్ సీట్లను డబ్బు ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు అంటూ మండిపడ్డారు. గత టిడిపి ప్రభుత్వంలో 58 కార్పొరేషన్లను ప్రైవేటుపరం చేసిన ఘనత చంద్రబాబు అని వెల్లడించారు. పీ ఫోర్ పేరుతో డబ్బులు ఉన్నవాళ్లను బడా బాబులను వేదికల మీద కూర్చోబెడుతున్నారని అంబటి రాంబాబు టార్గెట్ చేశారు.
కూటమి ప్రభుత్వానికి నూకలు చెల్లాయి
గతంలో చంద్రబాబు జన్మభూమి, శ్రమదానం అంటూ ప్రచారం చేసుకున్నారని ఇప్పుడు p ఫోర్ పేరుతో కొత్త ప్రచారాన్ని మొదలు పెట్టారని విమర్శించారు. కూటమి ప్రభుత్వానికి నూకలు చెల్లాయని ప్రజలంతా ప్రభుత్వం పైన తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని మాజీ మంత్రి అంబటి రాంబాబు జోస్యం చెప్పారు.












Click it and Unblock the Notifications