మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్.. 2 FIR లు నమోదు
మాజీమంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం చంద్రబాబుపై అనుచిత, అసభ్యకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై అందిన ఫిర్యాదు మేరకు గుంటూరులోని ఆయన నివాసం వద్ద పోలీసులు అంబటి రాంబాబును అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. అంబటి రాంబాబును పోలీసులు వజ్ర వాహనంలో ఎక్కించుకుని స్టేషన్ కు తరలించారు. ఈ క్రమంలో పోలీసుల వాహనంపై టీడీపీ కార్యకర్తలు దాడులకు దిగారు. ఆ వాహనాన్ని వెంబడించారు. అంబటి రాంబాబు తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. భారీ బందోబస్తు మధ్య అంబటిని నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై చేసిన అనుచిత వ్యాఖ్యలు కేసులో అంబటిని అదుపులోకి తీసుకున్నారు. అయితే అరెస్టుపై అంబటి రాంబాబు అంతకుముందే స్పందించారు. దమ్ముంటే తనను అరెస్ట్ చేసుకోవాలంటూ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. చంద్రబాబు నుంచి ఆదేశాలు వచ్చాయంటూ పోలీసులు తనను అరెస్ట్ చేయడానికి వస్తే.. జైలుకు వెళ్లడానికి తాను సిద్ధంగా ఉన్నానని అంబటి రాంబాబు స్పష్టం చేశారు.
అంబటి రాంబాబుపై రెండు కేసులు నమోదు చేశారు. 2 FIRలు నమోదు చేశారు పోలీసులు. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల వ్యవహారాన్ని సుమోటోగా తీసుకుని పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు ఫిర్యాదుతో అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు చేశారు. ఈ మేరకు పలు సెక్షన్ల కింద 2 ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు. 126(2), 132, 196(1), 352, 351(2), 292 రెడ్ విత్ 3(5) BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

మరోవైపు ఏపీ హైకోర్టులో అంబటి రాంబాబు భార్య హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తనతో పాటు 60 మందిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారని అంబటి రాంబాబు సతీమణి విజయలక్ష్మి పేర్కొన్నారు. తమకు రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని పిటిషన్ దాఖలు చేశారు. శాంతిభద్రత సమస్య ఉందని, పోలీసులు విఫలం చెందారని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ మేరకు 24 గంటలపాటు తమకు భద్రత కల్పించాలని విజయలక్ష్మి కోరారు. తక్షణం చర్యలు తీసుకోవాలని పిటిషన్లో కోరారు.












Click it and Unblock the Notifications