అమిత్ షా కు సీఎం జగన్ స్వాగతం-కలిసి శ్రీవారి దర్శనం : అందరు సీఎంలకు ఏపీ ముఖ్యమంత్రి విందు..!!
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ రోజు సాయంత్రం తిరుపతి చేరుకుంటారు. రేపు తిరుపతిలో జరిగే సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. అమిత్ షా కు ఏపీ సీఎం జగన్ స్వాగతం పలికేందుకు ఈ సాయంత్రం తిరుపతి వెళ్లనున్నారు. సీఎం జగన్ సాయంత్రం 6.15 గంటలకు గన్నవరం నుంచి బయలుదేరి రేణిగుంట చేరుకుంటారు. అక్కడ అమిత్షాకు స్వాగతం పలికి స్థానిక హోటల్ లో కాసేపు సేద తీరుతారు. అక్కడి నుంచి ఇద్దరూ తిరుమలలో శ్రీవారి దర్శనానికి వెళ్లనున్నారు.

అమిత్ షా తో సీఎం జగన్ చర్చలపై ఆసక్తి
రాత్రి 9.30 గంటల అనంతరం వారిద్దరూ శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం సీఎం జగన్ రేణిగుంట చేరుకుని తిరిగి తాడేపల్లి బయలుదేరుతారు. అర్ద్రరాత్రి 1 గంటకు తాడేపల్లిలోని నివాసానికి చేరుకోనున్నారు. అయితే, అమిత్ షా మూడు రోజుల ఏపీ పర్యటనలో భాగంగా.. ఈ సాయంత్రం తిరుపతి చేరుకొని రేపు ఉదయం నెల్లూరు జిల్లాకు వెళ్లనున్నారు. అక్కడ వెంకటగిరిలో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు చెందిన స్వర్ణభారతి ట్రస్టు కార్యక్రమాల్లో మధ్నాహ్నం వరకు పాల్గొంటారు.

షా సమావేశంలో ప్రత్యేక హోదా - మూడు రాజధానుల ప్రస్తావన
అక్కడి నుంచి తిరిగి తిరుపతి చేరుకొని మధ్నాహ్నం మూడు గంటలకు స్థానిక తాజ్ హోటల్లో జరగనున్న సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొంటారు. అమిత్ షా నెల్లూరు పర్యటన ముగించుకొని తిరుపతి చేరుకొనే సమయానికి తిరిగి సీఎం జగన్ సైతం మరోసారి తిరుపతి చేరుకుంటారు. ఆదివారం మధ్యాహ్నం 1.15 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి తిరుపతి బయలుదేరుతారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి తిరుపతి తాజ్ హోటల్లో అమిత్ షా అధ్యక్షతన జరిగే సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొంటారు. రాత్రి 8 గంటల వరకు సమావేశం జరిగే అవకాశం ఉంది.

పట్టాభి వ్యాఖ్యలు..తరువాత పరిణామాల పైన చర్చ
ఆ సమావేశం ముగిసిన తరువాత మీటింగ్ లో పాల్గొన్న అమిత్ షా తో సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సీఎం జగన్ విందు ఏర్పాటు చేసారు. ఇక, ఈ సమావేశంలో ఏపీ నుంచి ప్రస్తావించాల్సిన అంశాల పైన ఇప్పటికే సీఎం జగన్ రెండు సార్లు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రత్యేక హోదా అంశంతో పాటుగా మూడు రాజధానులకు నిధులు..రాజధాని నగర నిర్మాణానికి విభజన చట్టం హామీ మేరకు నిధుల కేటాయింపు పైన ప్రస్తావించనున్నారు. అదే విధంగా తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిల పైన చర్చించే అవకాశం ఉంది.

రాష్ట్రంలో పరిస్థితుల పైన సీఎం చర్చలు
ఇక, అమిత్ షా తో గత నెలలోనే సీఎం జగన్ సమావేశమవ్వాలని భావించారదు. అయితే, ఆ సమయంలో కాలు బెణికి సమస్య రావటంతో ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. కొద్ది కాలంగా రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు..టీడీపీ నేత పట్టాభి వ్యాఖ్యలు..టీడీపీ కార్యాలయం పైన దాడులతో పాటుగా ఇతర అంశాల పైన సీఎం జగన్ నేరుగా అమిత్ షా తో చర్చించే అవకాశం ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే అమిత్ షా కు ఈ అంశాల పైన ఫిర్యాదు చేయటంతో..సీఎం జగన్ సైతం ఆయనతో చర్చించే అవకాశం కనిపిస్తోంది.
Recommended Video

మూడు రోజుల పాటు షా పర్యటన
ఇక, సమావేశం ముగిసిన తరువాత సోమవారం ఉదయం కొంత సేపు అమిత్ షా పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. మరి కొందరికి అప్పాయింట్ మెంట్లు ఖరారు చేస్తారని తెలుస్తోంది. ఆ తరువాత ఆయన తిరుపతి నుంచి ఢిల్లీ వెళ్లనున్నారు. దీంతో..ఇప్పుడు అమిత్ షా పర్యటన రాజకీయంగానూ ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications