హైదరాబాద్కు అమిత్ షా: మజ్లిస్, తెరాసపై కసరత్తు
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలకు, మెదక్ పార్లమెంటు స్థానానికి జరిగే ఎన్నికలోనూ సత్తా చాటడానికి బీజేపీ సిద్ధమవుతున్నది. ఆ దిశగా పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా సభ ద్వారా కార్యకర్తల్లో ఉత్సాహం నింపాలని నిర్ణయించింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత కార్యకర్తల్లో నెలకొన్న స్తబ్దతను దూరం చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం అందుబాటులో ఉన్న తెలంగాణ రాష్ట్ర పదాధికారులతో పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.
పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీనియర్ నేతలు బండారు దత్తాత్రేయ, విద్యాసాగర్ రావు, బద్దం బాల్రెడ్డి, చింతా సాంబమూర్తి, నాగం జనార్దన్ రెడ్డి, యెండల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. కొత్తగా ఎన్నికైన పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆగస్టు రెండో వారంలో నగరంలో పర్యటించనున్నారంటూ సోమవారం కిషన్ రెడ్డి ప్రకటించారు. ఈ దృష్ట్యా ఆయన పర్యటన తేదీలపైనే సమావేశంలో చర్చించారు.
ఆగస్టు 21, 22 తేదీల్లో ఆయన పర్యటను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. తేదీల్లో మార్పు కూడా ఉండే అవకాశాలు లేకపోలేదంటున్నారు. 21న అమిత్ షాతో నిజాం కాలేజీలో భారీ బహిరంగ సభను నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. అదే రోజు ఉదయం అమిత్షాను ఎయిర్పోర్టు నుంచి భారీ ఊరేగింపుతో తీసుకురావాలని భావించారు. దీనికి నగరంలోని ప్రతి నియోజకవర్గం నుంచి మూడు వేల మంది నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని కిషన్ రెడ్డి సూచించారు.
అమిత్ షా జాతీయ అధ్యక్షుడుగా నియమితులయ్యాక తొలిసారిగా నిర్వహిస్తున్న సభ కావడం, తెలంగాణ వచ్చాక రెండో సభ కావడం వల్ల దీనిని భారీగా, శక్తి ప్రదర్శనగా నిర్వహించాలని నిర్ణయించారు. పైగా గ్రేటర్ హైదరాబాద్, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నందున కార్యకర్తల్లో ఉత్సాహం నింపేలా, ఓటర్లను ఆకర్షించేలా సభను నిర్వహించాలని నిర్ణయించారు.
బీజేపీ
మంగళవారం అందుబాటులో ఉన్న తెలంగాణ రాష్ట్ర పదాధికారులతో భారతీయ జనతా పార్టీ పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.
బీజేపీ
బీజేపీ కార్యాలయంలో జరిగిన భేటీలో పాల్గొన్న తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి, సీనియర్ నేతలు విద్యాసాగర రావు, నాగం జనార్ధన్ రెడ్డి తదితరులు.
బీజేపీ
గ్రేటర్ హైదరాబాద్, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలకు, మెదక్ పార్లమెంటు స్థానానికి జరిగే ఎన్నికలోనూ సత్తా చాటడానికి బీజేపీ సిద్ధమవుతున్నది. ఆ దిశగా పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా సభ ద్వారా కార్యకర్తల్లో ఉత్సాహం నింపాలని నిర్ణయించింది.
బీజేపీ
తెలంగాణ ఆవిర్భావం తర్వాత కార్యకర్తల్లో నెలకొన్న స్తబ్దతను దూరం చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం అందుబాటులో ఉన్న తెలంగాణ రాష్ట్ర పదాధికారులతో పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.
ఇప్పటికే అధికార తెరాస, మజ్లిస్తో పొత్తు పెట్టుకుని గ్రేటర్ ఎన్నికలకు వెళుతుందన్న సంకేతాలు అందుతున్నందున హైదరాబాద్పై జెండా ఎగురవేయాలంటే ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించాలన్న నిర్ణయం తీసుకున్నారు. అందుకే మొదటిసారిగా అమిత్ షాతో సభను నిర్వహించి, దశలవారీగా సభలు, సమావేశాలు, ఓటర్లను ఆకర్షించే కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు.
21న సభ ముగియగానే 22న గ్రామ కమిటీ అధ్యక్షులతో అమిత్ షా ముఖాముఖీ భేటీ అయ్యేలా కార్యక్రమాన్ని రూపొందించారు. దీన్ని కూడా పెద్ద ఎత్తున ఎల్బీ స్టేడియం వంటి చోట్ల నిర్వహించాలని భావిస్తున్నారు. ఆగస్టు 9న పార్టీ జాతీయ కౌన్సిల్ సమావేశం జరగనున్నందున 5న పార్టీ జిల్లా అధ్యక్షులతో సమావేశం నిర్వహించి, వారి నుంచి అభిప్రాయాలు తీసుకోవాలని నిర్ణయించారు.
ఇక మెదక్ లోకసభ ఉప ఎన్నికలో పార్టీ పోటీ చేయడంపైనా చర్చ జరిగింది. తెరాస ప్రభుత్వం ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించడం పట్ల సమావేశంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. మతపరంగా రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ వ్యతిరేకమని, వీటిని పార్టీ పరంగా వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. తెలంగాణకు ఎయిమ్స్ను మంజూరు చేయడానికి కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ సంసిద్ధతను వ్యక్తం చేయడం పట్ల సమావేశం ఆయనకు ధన్యవాదాలు తెలిపింది.