చంద్రబాబుకు ఎన్డీయే ద్వారాలు శాశ్వతంగా మూసేశాం .. అమిత్ షా సంచలనం
ఏపీలో ఎన్నికల ప్రచారంలో బీజేపీ ముఖ్యంగా చంద్రబాబుని టార్గెట్ చేసి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక బీజేపీ జాతీయ నాయకులు సైతం చంద్రబాబు పై నిప్పులు చెరుగుతున్నారు. మొన్నటికి మొన్న మోడీ చంద్రబాబు టార్గెట్ గా పోలవరం చంద్రబాబుకు ఏటీఎం అని సంచలన వ్యాఖ్యలు చేస్తే , తాజాగా బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా చంద్రబాబుకు ఎన్డీయే ద్వారాలు శాశ్వతంగా మూసేశాం అని ప్రకటించి సంచలనం సృష్టించారు.
ఆమె బీకాం లో ఫిజిక్స్ చదవలేదట .. బీజేపీ అభ్యర్థి నటి మాధవీ లత సెటైర్
చంద్రబాబు పెద్ద అవకాశవాది .. నర్సరావుపేట సభలో అమిత్ షా
నర్సరావుపేలో బీజేపీ ఎన్నికల ప్రచార సభలో అమిత్ షా, ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు పెద్ద అవకాశవాది అని బీజేపీ చీఫ్ అమిత్ షా అన్నారు. చంద్రబాబు లాంటి స్వార్ధపరుడు దేశంలో ఎక్కడా లేడని ఆయన అన్నారు. చంద్రబాబు తీరుపై షా అమిత్ షా విరుచుకుపడ్డారు. చంద్రబాబు తన స్వార్థ రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారిపోతారని అమిత్ షా విమర్శించారు.
సొంత మామనే వెన్నుపోటు పొడిచి అధికారం లాకున్నారని అమిత్ షా విమర్శ
2014లో మోడీ హవా చూసి చంద్రబాబు ఎన్డీయేలో చేరారని గుర్తు చేశారు. 2019 ఎన్నికల సమయంలో ఓటర్ల సానుభూతి కోసం ఎన్డీయే నుంచి బయటకు వచ్చేశారని ఆరోపించారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోగానే.. ఏపీలో ఆ పార్టీకి దూరంగా జరిగారని విమర్శించారు. చంద్రబాబు సొంత మామకే వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్నారని అమిత్ షా అన్నారు. నమ్మినవారిని మోసం చెయ్యడమే బాబు నైజం అన్నారు అమిత్ షా .ఏపీ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని షా చెప్పారు.
14 హామీల్లో 11 హామీలను నెరవేర్చాం .. పోలవరం కోసం 7వేల కోట్లు ఇచ్చాం అన్న షా
బీజేపీని గెలిపిస్తే ఏపీ రాజధాని అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. మోడీ ప్రభుత్వం ఏపీ అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేసిందన్న అమిత్ షా విభజన చట్టంలోని 14 హామీల్లో 11 హామీలను కేంద్ర ప్రభుత్వం పూర్తి చేసిందన్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి కేంద్రం రూ.7వేల కోట్లు ఇచ్చిందన్నారు. ఆ డబ్బుని చంద్రబాబు, మంత్రులు తమ ఖాతాల్లోకి మళ్లించారని, పోలవరం ప్రాజెక్ట్ పనులు ఆగిపోయేలా చేశారని అమిత్ షా ఆరోపించారు.
చంద్రబాబు మళ్ళీ ఎన్డీయేలోకి రావాలని చూస్తున్నారు.. డోర్స్ శాశ్వతంగా మూసేశామన్న అమిత్ షా
మోడీ గెలిస్తే మళ్లీ ఎన్డీయేలోకి రావాలని చంద్రబాబు చూస్తున్నారని, కానీ చంద్రబాబుకి ఎన్డీయే ద్వారాలు శాశ్వతంగా మూసేశామని చెప్పి ఆయన సంచలనం సృష్టించారు . కాంగ్రెస్, టీడీపీ ఏపీ ప్రజలను మోసం చేస్తున్నారని షా ఆరోపించారు. ఈ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు ప్రజలు బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. మొత్తానికి ఇంకెప్పుడూ టీడీపీ తో స్నేహ సంబంధాల కొనసాగింపు ఉండబోదు అని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా సభా ముఖంగా తేల్చి చెప్పారు.