అమ్మ ఒడి అమలుకు జనవరి నుండి శ్రీకారం.. సీఎం జగన్ నిర్ణయంతో అమ్మలకు సంతోషం
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చిన నవరత్నాల అమలుకు కృషి చేస్తున్నారు. రాష్ట్రం ఆర్ధిక ఇబ్బందుల్లో పీకల్లోతు కష్టాల్లో ఉన్నా తాను అందిస్తానని చెప్పిన పతకాలను అందించి తీరుతున్నారు. అలాంటి నవరత్నాల హామీనే అమ్మ ఒడి . చిన్నారులను బాగా చదివించుకోటానికి తల్లులకు ఏపీ ప్రభుత్వం అందించే ఆర్ధిక సాయమే అమ్మ ఒడి పథకం.
అమ్మఒడి పథకానికి తెల్లరేషన్ కార్డు ముడిపెట్టిన జగన్ సర్కార్...మీ అభిప్రాయం ఏమిటి..?
క్యాబినెట్ భేటీలో అమ్మ ఒడి పథకానికి ఆమోదం
వై ఎస్ జగన్ ఎన్నికలకు ముందు తాను ఇచ్చిన హామీలో భాగంగా పిల్లలను బడికి పంపే ప్రతి తల్లి బ్యాంకు ఖాతాలో 15 వేలు జమచేసేలా ‘అమ్మ ఒడి' పధకాన్ని అమలు చేస్తామని చెప్పారు. ఇక ఆ మాట నిలబెట్టుకోటానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. అమ్మ ఒడి పథకాన్ని ప్రకటించిన జగన్ జనవరి నుండి పథకం అమలుకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా ఇటీవల జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో ఈ పధకానికి ఆమోదముద్ర కూడా లభించింది.
1వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు విద్యార్థుల చదువులకు ఆర్ధిక సాయం
ఇక క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకు 1వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు పేద విద్యార్థులందరికీ ఈ అమ్మఒడి పధకం వర్తిస్తుందని అమ్మ ఒడి పథకం అమలు గురించి మంత్రి పేర్ని నానీ వెల్లడించారు. తల్లి లేని పిల్లల విషయంలో వాళ్ళ సంరక్షకులకు ఈ ఆర్ధిక సాయాన్ని అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించటం కోసం టీచర్లు నానా పాట్లు పడేవారు. కానీ ఇప్పుడు అమ్మ ఒడి పథకం ఎఫెక్ట్ తో తల్లిదండ్రులు చిన్నారులను స్కూల్స్ కు పంపేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. అందుకే గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈ విద్యా సంవత్సరంలో స్కూల్స్ లో చేరికలు పెరిగాయి. డ్రాప్ అవుట్స్ తగ్గాయి.
అమ్మ ఒడి ఎఫెక్ట్ .. స్కూల్స్ లో గణనీయంగా పెరిగిన విద్యార్థులు
పిల్లల్ని చదువు కోసం స్కూల్ కి పంపించటానికి తల్లిదండ్రులు నానా పాట్లు పడే స్థితి నుండి ఎత్తుకెళ్ళి మరీ స్కూల్ లో పడేసిన పరిస్థితి ఈ విద్యాసంవత్సరం ఆరంభంలో అమ్మ ఒడి పథకం ప్రకటనతో కనిపించింది. సీఎం జగన్ అందిస్తున్న అమ్మ ఒడి పథకం వల్ల తల్లిదండ్రుల చూపు సర్కారీ బడులలో స్ట్రెంత్ ను బాగా పెంచేసింది. ఏపీలోని స్కూల్స్ ఇప్పుడు విద్యార్థులతో కళకళలాడుతూ కనిపిస్తున్నాయి . ఏపీలో చాలా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా సంవత్సరం ఆరంభంలో అడ్మిషన్లు ఫుల్ అని బోర్డ్ పెట్టారు. ఇక అమ్మ ఒడి కోసం ఆశగా ఎదురు చూస్తున్న మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది సర్కార్ . జనవరిలో ప్రతి తల్లి ఖాతాలో 15వేలు జమ చెయ్యనుంది.
ఏటా రూ.15,000 ఖాతాలోకి ... వచ్చే జనవరి నుండే తల్లుల ఖాతాల్లోకి నగదు
అమ్మ ఒడి పథకం అమలు కోసం రూ.6,450 కోట్లు కేటాయింపు చేసింది ఏపీ ప్రభుత్వం . ఇక ఈ పథకం పొందటానికి తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు కలిగి ఉన్న వారు అర్హులు. వారికి అమ్మఒడి పథకం కింద ప్రతి ఏటా రూ.15,000 అందజేయనున్నారు . వచ్చే ఏడాది జనవరి నుంచి విద్యార్థుల తల్లుల బ్యాంక్ అకౌంట్లలోకి అమ్మఒడి పథకం ఆర్ధిక సహాయం పడనుంది. దీంతో తమ పిల్లల చదువులకు భరోసా కలుగుతుందని తల్లులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.