'అమరావతి' భద్రత కత్తిమీద సాము: పూర్తిస్థాయి బందోబస్తు
గుంటూరు: రాజధాని అమరావతి శంకుస్థాపనకు పూర్తిస్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని డీజీపీ జేవీ రాముడు శుక్రవారం తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ, విదేశీ ప్రముఖులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలతో సహా లక్షలమంది తరలి వస్తున్నారు. చరిత్రలో నిలిచే వేడుకకు భద్రతా ఏర్పాట్లు కత్తిమీద సామే అని చెప్పవచ్చు.
కాగా, 'మై బ్రిక్ మై అమరావతి ' అనే వినూత్న కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం గురువారం ప్రారంభించింది. అమరావతి నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కనీసం ఒక ఇటుకనైనా విరాళంగా అందజేసేందుకు వీలుగా ఆన్లైన్ చెల్లింపుల విధానాన్ని ప్రవేశపెట్టారు.
అమరావతి ఇటుకను ఆన్లైన్ విధానంలో ఎవరైనా కనీసం రూ.10 పెట్టి కొనుగోలు చేయవచ్చు. ఇలా కొనుగోలు చేసిన వారి వివరాలను ఎలక్ట్రానిక్ డేటాబేస్లో ఉంచుతారు. ముఖ్యమంత్రి మొదలు పెట్టిన ఈ కార్యక్రమానికి తొలి రోజే మంచి స్పందన వచ్చింది.
ప్రారంభించిన సాయంత్రానికే 53,502 ఇటుకల కొనుగోలు జరిగింది. ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని ఆవిష్కరిస్తున్న సమయంలోనే శ్రీనివాస్ వల్లూరి అనే వ్యక్తి 108 ఇటుకలను ఆన్లైన్లో కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
108 ఈ-ఇటుకలను కొనుగోలు చేయడం ద్వారా సీఆర్డీఏ ఉద్యోగులంతా కలిసి తమ ఒక రోజు వేతనం రూ.5.22 లక్షలు విరాళంగా అందజేశారు. దాతలు, ఇతర వివరాలను అమరావతి వెబ్ సైట్లో ఉంచారు.
పెద్ద మొత్తంలో ఈ-ఇటుకలను కొనుగోలు చేసిన వారి పేర్లను అమరావతిలో నిర్మించే స్థూపంపై పొందుపర్చాలన్న ప్రతిపాదనపై పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు. అమరావతి ఇటుకలను కొనుగోలు చేసిన వారికి ముఖ్యమంత్రి సంతకంతో కూడిన ధ్రువీకరణ పత్రాన్ని పంపాలని నిర్ణయించారు.
ఈ వెబ్సైట్కు మొదటి రోజు.. అంటే గురువారం రాత్రి పది గంటల వరకు 23 లక్షల విరాళాలు వచ్చాయని తెలుస్తోంది. తొలిరోజు 2,200 మందికి పైగా దాదాపు ఇరవై మూడు వేలకు పైగా ఇటుకలను కొనుగోలు చేశారు.