గుంటూరులో వృద్దుడి మర్డర్.. : అక్రమ సంబంధమే అంతు చూసిందా?
గుంటూరు : గుంటూరులో ఓ వృద్ధుడి దారుణ హత్య స్థానికంగా కలకలం రేపుతోంది. మిస్టరీగా మారిన హత్యకు సంబంధించి పోలీసులు అసలు విషయాన్ని చేధించే పనిలో పడ్డారు. గుంటూరు పరిధిలోని కాకాని రోడ్డుకు సమీపంలో ఉన్న నవభారత్ కాలనీలో ఈ హత్య జరిగినట్టుగా తెలుస్తోంది.
గుంటూరు పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. వివాహేతర సంబంధమే వృద్ధుడి హత్యకు దారి తీసిందా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హత్యకు గురైన వృద్ధుడిని నవభారత్ కాలనీ 1వ లైన్ కు చెందిన నిశ్శంకర సాంబశివరావు (70) గా గుర్తించారు పోలీసులు.
కాగా, నిశ్శంకర సాంబశివరావు స్థానిక జిన్నా టవర్ సెంటర్ లో ఎలక్ట్రికల్ హోల్ డీలర్ గా వ్యాపారం నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. సాంబశివరావుకు ఇద్దరు భార్యలు కాగా అందులో రెండో భార్య ఆరేళ్ల క్రితమే చనిపోయినట్టు సమాచారం. ఇదిలా ఉంటే, అమరావతి రోడ్డులో ఉండే ఇద్దరు మహిళలతో సాంబశివరావు గత కొద్దిరోజులుగా వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.

తనతో వివాహేతర సంబంధం కొనసాగిస్తోన్న మహిళలకు గోరంట్ల ప్రాంతంలో రూ.25 లక్షల విలువ చేసే స్థలాన్నిసాంబశివరావు వాళ్ల పేర రాసిచ్చినట్టుగా తెలుస్తోంది. ఇదే క్రమంలో సదరు మహిళల భర్తలు సాంబశివరావుతో పలుమార్లు గొడవకు దిగడం.. ఆదివారం తెల్లవారు జామున సాంబశివరావు హత్యకు గురవడం అనుమానాలకు తావిస్తోంది.
దుండగులు సాంబశివరావును కత్తులతో పొడిచి హత్య చేశారు. అనంతరం సాంబశివరావుకు చెందిన బైక్ పై అక్కడినుంచి పరారయ్యారు. విషయం తెలుసుకున్న ఈస్ట్ డీఎస్పీ సంతోష్, పాతగుంటూరు సీఐ పీ బాలమురళీకృష్ణ, లాలాపేట సీఐ నరసింహరావు ఘటనా స్థలికి చేరుకొని హత్య జరిగిన తీరును పరిశీలించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ ను కూడా రంగంలోకి దింపిన పోలీసులు హత్య జరిగిన ప్రాంతమంతా గాలించారు. కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తును ముమ్మరం చేశారు.












Click it and Unblock the Notifications