బొత్స రాయబారం: జగన్ పార్టీ వైపు చూస్తున్న ఆనం బ్రదర్స్?
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీ నాయకులు ఆనం సోదరులు జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వైపు చూస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. వారిని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి తెచ్చేందుకు సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. బొత్స సత్యనారాయణ ఆనం నారాయణ రెడ్డికి సన్నిహితులు. దీంతో ఆయన ప్రయత్నాలు ఫలించే అవకాశాలున్నట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి.
నెల్లూరు జిల్లాకు చెదిన ఆనం సోదరులను తమ పార్టీలోకి తెచ్చే బాధ్యతను వైసీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ తీసుకున్నట్లు సమాచరాం. అయితే జిల్లాలోని ఇతర నేతల అభిప్రాయాలను కనుగొన్న తరువాత జగన్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాజశేఖర్ రెడ్డి మరణానంతరం జగన్మోహన్ రెడ్డిని సిఎం చేయాలంటూ తొలి సంతకాలు చేసిన వారిలో ఆనం సోదరులు ముందున్నారు.
బొత్స సత్యనారాయణతో పాటు ఆనం సోదరులు దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితులు. వైయస్ ప్రభుత్వ హయాంలో వారికి తిరుగు ఉండేది కాదు. అయితే మారుతున్న సమీకరణలను అనుసరించి వారు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. ఆపై జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా చేశారు. కానీ, కాంగ్రెసు పార్టీకి జవజీవాలు పోయడం కష్టమని భావించిన ఆనం సోదరులు మనసు మార్చుకున్నట్లు చెబుతున్నారు.
పార్టీలో చేరే అవకాశాలు ఉండడం వల్లనే ఆనం సోదరులు చాలా కాలంగా జగన్ పై విమర్శలు చేయడం లేదని అంటున్నారు. బొత్స సత్యనారాయణ వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరిన తర్వాత ఆనం బ్రదర్స్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు హాజరు కావడం లేదు. దీన్ని బట్టి చూస్తే వారు కూడా వైసీపీ వైపు చూస్తున్నారనే భావన బలపడుతోంది. ఇందులో భాగంగానే బొత్స సత్యనారాయణ ఇప్పటికే జగన్ ను కలసి ఆనం సోదరులను పార్టీలో చేర్చుకునే విషయంపై చర్చించినట్లు తెలుస్తోంది.
అయితే, అక్కడ మేకపాటి సోదరులతో పాటు ఇతర నాయకుల అభిప్రాయాలను కనుక్కుని, వాటిని పరిగణనలోకి తీసుకునే అవసరం దృష్ట్యా వారి ఎంట్రీకి జగన్ సమయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఆనం సోదరులను చేర్చుకోవడంలో తమకు ఎటువంటి అభ్యంతరం లేదని మేకపాటి సోదరులు చెప్పినట్లు సమాచారం.