టిడిపికి ఆనం బ్రదర్స్ బాధ్యతల చిక్కు, జగన్పై 'చెప్పు' వ్యాఖ్య ఎపెక్ట్
నెల్లూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు, నెల్లూరులను తెలుగుదేశం పార్టీ బాధ్యతలను ఆనం సోదరుల చేతుల్లో పెట్టాలని నిర్ణయించారని తెలుస్తోంది. దీనిని స్థానిక టిడిపి ఇంఛార్జులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ఆత్మకూరు, నెల్లూరులను ఆనం సోదరుల చేతిలో పెట్టాలని మంత్రి నారాయణ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సిఫార్సు చేశారని, అందుకు అధినేత పచ్చ జెండా ఊపారని తెలుస్తోంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని తాను చూసుకుంటానని, నెల్లూరు, ఆత్మకూరులను వారికివ్వాలని నారాయణ సూచించారని తెలుస్తోంది.
దీనిపై ఆత్మకూరు టిడిపి ఇంఛార్జ్ కన్నబాబు మాత్రం ససేమీరా అంటున్నారు. ఆనం సోదరులకు ఆత్మకూరు బాధ్యతలను అప్పగించడం సరికాదని చెబుతున్నారట. తాము మొదటి నుంచి పార్టీ కోసం పని చేస్తున్నామని, ఇప్పుడు వచ్చి న వారి కోసం తమను పక్కన పెట్టడం ఏమిటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అయితే, ఆత్మకూరు, నెల్లూరుల బాధ్యతలను ఆనం సోదరులకు అప్పగిస్తే స్థానిక టిడిపిలో విభేదాలు భగ్గుమనే అవకాసాలున్నాయి. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య సర్దుబాటు చేయాల్సిన బాధ్యతను మంత్రి నారాయణ పైన పెట్టారని తెలుస్తోంది.
జగన్ యాత్రను అడ్డుకునేందుకు టిడిపి యత్నం
అనంతపురం జిల్లాలో వైసిపి అధినేత జగన్ చేపట్టిన భరోసాయాత్రలో శుక్రవారం ఉదయం ఉద్రిక్తత చోటు చేసుకుంది. పెద్ద వడుగూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు పైన జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. బాబును చెప్పుతో కొట్టాలని తీవ్ర వ్యాఖ్యలు చేసారు.
ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం టిడిపి కార్యకర్తలు జగన్ యాత్రను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆయన యాత్రను అడ్డుకునేందుకు వేలాదిమంది కార్యకర్తలు రోడ్డెక్కారు. దీంతో పోలీసులు పెద్ద ఎత్తున రంగంలోకి దిగారు. టిడిపి కార్యకర్తలను అక్కడి నుంచి పంపించి వేశారు.