బాబుకి ఆనం వత్తాసు, వద్దని జగన్కు: చెక్కిచ్చిన లోకేష్
మెదక్/ఎస్పీఎస్ నెల్లూరు: రుణమాఫీ పైన ఉద్యమానికి సిద్ధమవుతున్న కాంగ్రెసు పార్టీ నేతల పైన ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారట. టీడీపీ రుణమాఫీ నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రైతు రుణమాఫీకి ఆమోదం తెలిపినప్పుడు ఉద్యమాలు ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఒకరిద్దరు నిర్ణయాలు తీసుకుంటే ఇలాగే ఉంటుందని ఆనం ఎద్దేవా చేశారు. ఉద్యమాలు పార్టీ కోసం కాకుండా ప్రజల కోసం చేయాలని హితవు పలికారు. తమ పార్టీ చేయనున్న రైతు ఉద్యమాన్ని తాను సమ్మతించనని చెప్పారు.
అదే సమయంలో చంద్రబాబు పైన కూడా ఆయన మండిపడ్డారు. రుణమాఫీ పూర్తిగా సాధ్యం కాదని తొమ్మిదేళ్లు పాలించిన బాబుకు తెలియదా అన్నారు. శ్వేత పత్రాలని చంద్రబాబు ఎందుకు హడావుడి చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే వాటిని రద్దు చేసి కొత్త నిర్ణయాలు తీసుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడపాలన్నారు.
ఆర్బీఐ నిబంధనల ప్రకారం మన రాష్ట్రం రుణాల రీషెడ్యూలుకు అర్హత సాధించదన్నారు. అధికారంలోకి రావాలనే తొందర్లో పెద్ద పెద్ద హామీలు ఇచ్చి ఇప్పుడు తలపట్టుకుంటున్నారన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు నిండకుండానే విమర్శలు అవసరమా అని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి హితవు పలికారు.
పరిపాలన ఎలా ఉండబోతుంది అనే స్పష్టత రాకుండానే ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసిరావాలి... ఆందోళన చేస్తామంటే తాము సహకరించడానికి సిద్ధంగా లేమన్నారు. అంతగా ఆందోళన చేయాలని ఉంటే హైదరాబాదులోని ట్యాంక్బండ్ మీద ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలంటూ ఆందోళన చేయాలన్నారు.
కాగా, కొద్ది రోజుల క్రితం ఆనం సోదరులు తెలుగుదేశం పార్టీలోకి వెళ్తారనే ప్రచారం సాగిన విషయం తెలిసిందే. అది కాకపోయినా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసనకు అంతగా స్పందన రాలేదని, ఆ కారణంగానే ఆయన వ్యతిరేకిస్తుండవచ్చునని కూడా అంటున్నారు.
చెక్కులిచ్చిన నారా లోకేష్
మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద జరిగిన పాఠశాల బస్సు ప్రమాదంలో చిన్నారులను కోల్పోయిన కుటుంబాలను తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ బుధవారం పరామర్శించారు.ఈ ప్రమాదంలో పిల్లలను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న వారి కన్నీళ్లు తుడిచే ప్రయత్నం చేశారు. జిల్లాలోని వేర్వేరు గ్రామాల్లో కూడా బాధిత కుటుంబాలను నేరుగా ఇంటికి వెళ్లి లోకేష్ పరామర్శించారు. వారికి లక్ష రూపాయల చొప్పున చెక్కులను ఆయన అందజేశారు.
తాము ఇచ్చిన లక్ష రూపాయల చెక్కుతో సమస్యలన్నీ పరిష్కారం కాబోవని నారా లోకేష్ అన్నారు. రైలు ప్రమాదంలో మరణించినవారి కుటుంబాల పిల్లలకు ఎన్టీఆర్ ట్రస్టు తరఫున విద్యకు సహకారం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. తెలుగువాళ్లు ఎక్కడ ఉన్నా తాము ఆదుకుంటామని చెప్పారు.