ఎన్డీయేకి ఆనం మెచ్చుకోలు, పొన్నాలకు సీనియర్ సెగ
హైదరాబాద్: పార్లమెంటులో పోలవరం ఆర్డినెన్స్ ఆమోదం పొందిన నేపథ్యంలో కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకుడు ఆనం వివేకానంద రెడ్డి భారతీయ జనతా పార్టీ నేతృత్వత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు.
పార్లమెంటు ఉభయసభల్లో పోలవరం ఆర్డినెన్స్ ఆమోదం పొందడం హర్షదాకయకమని ఆయన అన్నారు. పోలవరం బిల్లును రూపొందించిన యూపీఏకు, బిల్లును ఉభయ సభలలో పాస్ చేయించిన ఎన్డీఏకు కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా యూపీఏకు, ఎన్డీయేకు రుణపడి ఉంటారన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలని ఆయన కోరారు.

జానా వర్సెస్ పొన్నాల
తెలంగాణ కాంగ్రెస్లో రచ్చ మొదలైంది. పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్యకు, సిఎల్పి నేత జానారెడ్డికి మధ్య విబేధాలు తీవ్రమయ్యాయి. టీపీసీసీ కార్యక్రమాలను స్వయంగా నిర్వహించేందుకు జానారెడ్డి రంగంలోకి దిగారు. అందులో భాగంగా వచ్చే నెల 4న పార్టీ ఎమ్మెల్యేలతోపాటు ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులందరితోనూ సమావేశం ఏర్పాటు చేశారు.
ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను విశ్లేషించడం, పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన భవిష్యత్ కార్యాచరణను రూపొందించడం, ప్రజాసమస్యలను శాసనసభా వేదికగా పరిష్కరించేందుకు కృషి చేయడం వంటి అంశాలు ఎజెండాగా ఖరారు చేశారు. పొన్నాలకు, శాసనమండలిలో కాంగ్రెసు నేత డీ శ్రీనివాస్కు మాట మాత్రం చెప్పకుండా ఈ సమావేశం ఏర్పాటు చేశారట. ఈ సమావేశం ఏర్పాటు చెయ్యడం వారిద్దరికి ఆగ్రహం తెప్పించింది.
దీనిపై డి శ్రీనివాస్ పరోక్షంగా అసంతృప్తి వ్యక్తం చేయగా, పొన్నాల బహిరంగంగానే ఆక్షేపించారు. కష్టకాలంలో ఐక్యంగా ఉండవలసిన సమయంలో ఈ విబేధాలు మంచిది కాదని డి శ్రీనివాస్ హితవు పలికారు. దీంతో జానారెడ్డి ఫోన్ చేసి ఆయనతో మాట్లాడారు. అయితే పొన్నాలతో మాత్రం జానారెడ్డికి అంతరం కొనసాగుతున్నట్లే కనిపిస్తోంది. పలువురు సీనియర్లు పొన్నాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications