జగన్ ఎవరు?: 'మాహాపాపి, చంద్రబాబుని దిగిపో అనేంత మొనగాడా'
అమరావతి: ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షమైన వైసీపీ మొదలుపెట్టిన 'గడగడపకు వైసీపీ' కార్యక్రమంపై టీడీపీ సీనియర్ నేత ఆనం వివేకానంద రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. శనివారం ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ వైసీపీ అధినేత వైయస్ జగన్పై మండిపడ్డారు.
జగన్ని మహాపాపిగా అభివర్ణించారు. ఏపీని దోచేశారని, దాంతో ఏపీ పేద రాష్ట్రంగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. 'గడగడపకు వైసీపీ' కార్యక్రమాన్ని ఓ ప్రహసనం అని అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా వైసీపీ నేతలు ప్రజలకి ఏం చెప్పదలచుకుంటున్నారని ఆయన నిలదీశారు.

ఆ విషయాల్ని వైసీపీ నేతలు ముందుగా మీడియాకి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజా బ్యాలెట్ అంటూ హంగామా చేసి ముఖ్యమంత్రి చంద్రబాబుకు జీరో మార్కులు అంటూ వైసీపీ నేతలు వ్యాఖ్యానించడాన్ని ఆయన తప్పుబట్టారు. సీఎంకు మార్కులు వేయడానికి వైసీపీ నేతలెవరు..? అని ఆయన ప్రశ్నించారు.
జగన్ చెప్పే మాటల్ని ప్రజలు నమ్మేస్థితిలో లేరని ఆయన అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన కుమారుడు జగన్ లక్ష కోట్లు దోచుకున్నారని అటువంటి నేత మాటలను ప్రజలు నమ్మేస్థితిలో లేరని ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీ మాటలు నమ్మడానికి తెలుగు ప్రజలు పిచ్చోళ్లేం కాదని అన్నారు.
వైసీపీ అధినేత గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో జగన్ గమనించాలని ఆనం వివేకా సూచించారు. చంద్రబాబు సీఎం సీటు ఎప్పుడు దిగుతారా..? అని మాత్రమే వైసీపీ నేతలు ఆలోచిస్తున్నారని, వారికి రాష్ట్రాభివృద్ధి ఏ మాత్రం పట్టదని ఆయన అన్నారు.
'చంద్రబాబుని సీటు నుంచి దించాలనుకుంటే ఆయనని ఆ సీటుపై కూర్చోబెట్టిన వాళ్లకే సాధ్యం అవుతుంది తప్ప, సీఎంను తన సీటు నుంచి దిగమనడానికి జగన్ ఎవరు..?' అని ఆయన ప్రశ్నించారు. జగన్ని మాత్రం ప్రతిపక్ష నాయకుడి హోదా నుంచి ప్రజలు దించేసే రోజులు దగ్గర పడ్డాయని ఆయన ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications