రోజాది కల: జగన్పై ఆనం ఘాటు వ్యాఖ్య, అసెంబ్లీలో ఏ పార్టీ బలం ఎంత?
నెల్లూరు/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి ఆదివారం నాడు వైసిపి అధినేత జగన్ పైన ఘాటు వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో వైసిపి ఎమ్మెల్యే రోజాను తన చెల్లిగా అభివర్ణించారు.
2019లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, అప్పటి నుంచి ముప్పై ఏళ్ల పాటు రాష్ట్రానికి జగన్ ముఖ్యమంత్రిగా కొనసాగుతారని ఎమ్మెల్యే రోజా కలలు కంటున్నారని ఆనం ఎద్దేవా చేశారు. అయితే అందుకు భిన్నంగా మరో మూడు నెలల పాటు ఆ పార్టీ ఉంటేనే గొప్ప అన్నారు.
అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే వైసిపి ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరడం ఖాయమన్నారు. విపక్ష నేతగా వైయస్ జగన్ పూర్తిగా విఫలమయ్యారని చెప్పారు. ఆయన విపక్ష నేతగా పనికి రాడన్నారు. పార్టీ ఆవిర్భావ దినం రోజు కనీసం జండా ఎగరవేయలేని జగన్.. ఎక్కడికో వెళ్లారని ఆరోపించారు.
తెలుగుదేశం ప్రభుత్వం పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు అధికార పార్టీ ఆదివారం కసరత్తు చేసింది. ప్రభుత్వంపై వైసిపి దుష్ప్రచారాన్ని అసెంబ్లీలో ఎండగట్టాలని పార్టీ ఎమ్మెల్యేలు నిర్ణయించారు.
ఈ క్రమంలో సభలో మంత్రులు, సభ్యులు ఎవరు ఏయే అంశాలపై మాట్లాడితే బాగుంటుంది, ఏయే అంశాలు చర్చకు వచ్చే అవకాశముంది తదితర అంశాలపై చర్చించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఏపీ టిడిపి అధ్యక్షులు కళా వెంకట్రావు అధ్యక్షతన సమావేశం జరిగింది.
కాగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు ప్రభుత్వం పైన అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిని స్పీకర్ కోడెల శివప్రసాద రావు ఆమోదించారు.
సోమవారం వైసిపి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అవిశ్వాస తీర్మానం నోటీసును సభలో పెట్టారు. స్పీకర్ అవిశ్వాస నోటీసు పైన సభ అభిప్రాయం తీసుకున్నారు. అనంతరం బీఏసీ సమావేశమవుతుంది. బీఏసీ నిర్ణయం తర్వాత అవిశ్వాస నోటీసు పై చర్చకు తేదీలు ప్రకటించనున్నారు. సభలో బలాబలాలు.. టిడిపి 112 (వైసిపి నుంచి చేరిన 8 మంది ఎమ్మెల్యేలు, స్వతంత్రులు కలిపి), బిజెపి 4, వైయస్సార్ కాంగ్రెస్ 59 మంది ఉన్నారు.