"జగన్ కి తెలియని జ్ఞానోదయం ఏంటంటే..! : ఆయనో అసలైన విలన్, చంద్రబాబే మళ్లీ హీరో.."
విజయవాడ : రాజకీయాలకు సినిమా తత్వాన్ని జోడించి సినిమాలను మించిన డైలాగులతో విమర్శలు-ప్రతి విమర్శలతో మాటల యుధ్దానికి తెరలేపుతున్నారు ఏపీ అధికార-ప్రతిపక్ష నేతలు. విజయవాడలో నిర్వహించిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆ పార్టీ నేతలంతా చంద్రబాబుని టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పించిన నేపథ్యంలో.. అందుకు కౌంటర్ ఎటాక్ మొదలుపెట్టారు అధికార పార్టీ నేతలు.
తాజాగా వైసీపీ నేతల విమర్శలపై స్పందించిన టీడీపీ నేత ఆనం రాంనారాయణరెడ్డి.. జగన్ 'అసలు సిసలు విలన్ అని, హీరో అయ్యే ఛాన్స్ ఎప్పటికీ లేదని' కౌంటర్ ఎటాక్ చేశారు. వైసీపీ తీరును తప్పుబడుతూ బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన, జగన్ పై విమర్శలతో విరుచుకుపడ్డారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'జగన్ మాట్లేడటప్పుడు ఆయన హావభావాలు గమనిస్తే.. అచ్చం విలన్ లా ఉంటారని, 24 రీళ్లు పూర్తయిపోయినా జగన్కు మాత్రం ఇంకా జ్ఞానోదయం అవడం లేదని' దుయ్యబట్టారు. జగన్ ఏం చేసినా..! మిగతా 36 రీళ్లు కూడా పూర్తయ్యాక చంద్రబాబునే మరోసారి హీరో చేయాలన్న యోచనలో ఏపీ జనం ఉన్నారని చెప్పుకొచ్చారు .
ఇక కాపుల ప్రయోజనాల కోసం కృషి చేస్తోన్న చంద్రబాబు ప్రభుత్వాన్ని జగన్ అడ్డుకుంటున్నారని ఆరోపించిన ఆనం, ముద్రగడపై జగన్ ది మొసలి కన్నీరుగా అభివర్ణించారు. ఇప్పటికే జగన్ పతనం మొదలైందని విమర్శించిన ఆయన, రెండేళ్ల తర్వాత గానీ జగన్ కి రాజధాని పట్టించుకునే తీరిక దొరకలేదన్నారు.
ఆనం తన వ్యాఖ్యలకు మరింత పదును పెడుతూ.. ఏపీ ప్రజలంతా ఓ ధన పిశాచికి ప్రతిపక్ష హోదా కట్టబెట్టినందుకు బాధపడుతున్నారని ఆరోపించారు. 'జగన్ ఎంత ప్రసంగించినా.. దాని సారాంశమంతా ముఖ్యమంత్రి పదవి, డబ్బు చుట్టే తిరుగుతుందని' ఎద్దేవా చేశారు.
ఇక కాపు రిజర్వేషన్ల సమస్య గురించి ప్రస్తావిస్తూ.. సమస్యను సున్నితంగా పరిష్కరించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఇప్పుడు కాపు ప్రయోజనాల కోసం మాట్లాడుతున్న నేతలంతా మంజునాథ కమిషన్ ను ఎందుకు కలవలేకపోయారని..? అంత తీరిక లేకుండా ఉన్నారా..? అంటూ నిలదీశారు. ముద్రగడను అడ్డుపెట్టుకుని తమ రాజకీయ ఉనికిని కాపాడుకునే ధోరణితో కొందరు నేతలు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.