ఏపీలో వాహనదారులకు గుడ్ న్యూస్..! ఇక ఈ సేవలన్నీ ఆటోమేటిగ్గా ఆన్ లైన్లో..!
ఏపీలో వాహనదారులు గత కొన్నేళ్లుగా పలు విషయాల్లో తీవ్ర కష్టాలు పడుతున్నారు. ముఖ్యంగా మామూళ్లకు అలవాటుపడిన కొందరు రవాణాశాఖ అధికారుల కారణంగా వాహనాల కొనుగోలు దగ్గరి నుంచి, ఫైనాన్స్, దాని తొలగింపు, అడ్రస్ మార్పు, ఇతర రాష్ట్రాల వాహనాలు కొనుగోలు చేసినప్పుడు చేసే రీరిజిస్ట్రేషన్లు.. ఇలా ప్రతీ అంశంలోనూ ఇబ్బందులే. దరఖాస్తు చేసుకున్న వారాల తర్వాత కూడా డబ్బులిస్తే కానీ చాలా చోట్ల అనుమతులు లభించని పరిస్ధితి. దీనికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం (AP Govt) కీలక నిర్ణయాలు తీసుకుంది.
సీఎం చంద్రబాబు తాజాగా నిర్వహించిన ఆర్టీజీఎస్ సమీక్ష సందర్బంగా రవాణాశాఖ 66 శాతం ఆన్ లైన్ సేవలు అందిస్తోందని, దీన్ని 100 శాతానికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా రవాణాశాఖ (AP Transport Department) వాహనదారులకు అందిస్తున్న పలు సేవల్ని ఆన్ లైన్ లో ఆటోమేటిక్ గా మార్చేయబోతున్నారు. వీటిలో వాహనాలకు ఫైనాన్స్ (Vehicle Finance) తీసుకున్నప్పుడు, లేదా ఈఎంఐల చెల్లింపు పూర్తయిన తర్వాత వాహనంపై ఫైనాన్స్ తొలగించాల్సి వచ్చినప్పుడు (Hypothecation) ఆటోమేటిగ్గా దరఖాస్తు చేసుకుంటే అనుమతి ఇవ్వనున్నారు.

అలాగే వాహనదారులు తమ వాహనాలకు అడ్రస్ మార్చుకున్నా(Address Change) త్వరగా అనుమతులు ఇవ్వడం లేదు. ఇప్పుడు దీన్నీ ఆన్ లైన్ లో ఆటోమేటిక్ సేవగా మార్చనున్నారు. దీంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వాహనాలు కొనుగోలు చేసినప్పుడు, వాటికి మన రాష్ట్రంలో రవాణా అధికారులు రీరిజిస్ట్రేషన్ చేసి అనుమతులు ఇచ్చేందుకు జాప్యం చేస్తున్నారు. ఇకపై ఈ సర్వీస్ ను కూడా ఆటోమేటిగ్గా మార్చబోతున్నారు. వాహనం కొనుగోలు చేసిన రాష్ట్రంలో ఇచ్చిన ఎన్వోసీ సమర్పిస్తే, ఇక్కడి అధికారుల తనిఖీ లేకుండానే రీరిజిస్ట్రేషషన్ చేస్తారు. అలాగే వాహనాలకు రిజిస్ట్రేషన్లు చేస్తున్న డీలర్లపై ఏడాదికోసారి చేస్తున్న తనిఖీలను ఐదేళ్లకు పెంచుతారు. ఈ మార్పులన్నీ మూడు నెలల్లో అమల్లోకి రానున్నాయి.




Click it and Unblock the Notifications