ఆనందయ్య మందు-వందల కోట్ల స్కామ్కు తెరదీశారన్న సోమిరెడ్డి-నిరూపిస్తే ఉరేసుకుంటానన్న కాకాని
కృష్ణపట్నం ఆనందయ్య నాటు మందు పంపిణీపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. ఎమ్మెల్యే కాకాని గోవర్దన్ రెడ్డి,మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిల మధ్య దీనిపై మాటల తూటాలు పేలుతున్నాయి. ఆనందయ్య మందును సొమ్ము చేసుకునేందుకు ఎమ్మెల్యే కాకాని పెద్ద స్కామ్కి తెరదీశారని సోమిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఆ స్కామ్ ఏంటో నిరూపిస్తే నడిరోడ్డుపై తనకు తానే ఉరివేసుకుంటానని ఎమ్మెల్యే కాకాని సవాల్ విసిరారు. మరోవైపు ప్రభుత్వ సహకారం లేకపోవడంతో సోమవారం(జూన్ 5) నుంచి ప్రారంభం కావాల్సిన మందు పంపిణీని నిలిపివేస్తున్నట్లు ఆనందయ్య అనుచరులు ప్రకటించారు. దీంతో ఆనందయ్య మందు పంపిణీ విషయంలో పెద్ద గందరగోళం నెలకొంది.
సోమిరెడ్డి సంచలన ఆరోపణలు
మే 21 తేదీన 'గో డాడీ' సంస్థ వద్ద శిశ్రిత టెక్నాలజీస్ అనే మరో సంస్థ చిల్డీల్.ఇన్ వెబ్సైట్ను కొనుగోలు చేసిందని సోమిరెడ్డి అన్నారు. జూన్ 2న మధ్యాహ్నం 11.45 నిమిషాలకి ఆ వెబ్సైట్ను ఇంటర్నెట్లో హోస్ట్ చేశారని తెలిపారు.ఆ మరుసటిరోజు జూన్ 3వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంటకు దాన్ని తొలగించారని చెప్పారు. ఆ వెబ్సైట్లో సీఎం జగన్,మంత్రి గౌతమ్ రెడ్డి,ఎమ్మెల్యే కాకాని ఫోటోలు ప్రచురించారని చెప్పారు. ఆ వెబ్సైట్లో డైరెక్టర్లు వైసీపీ నాయకులేనని ఆరోపించారు. నెల్లూరులోని సుజాతమ్మ కాలనీలో దానికి సంబంధించిన ఆఫీస్ ఏర్పాటు చేశారన్నారు. ఆనందయ్య మందును ఆ వెబ్సైట్లో రూ.15 ధరగా చూపించారని... కానీ పర్చేస్ ఆర్డర్ రూ.167గా ఉందని చెప్పారు. ఈ లెక్కన ఆ మందును ఒక కోటి మందికి అమ్మితే రూ.120 కోట్లు,రాష్ట్రంలోని 5 కోట్ల మందికి అమ్మితే రూ.600 కోట్లు సొమ్ము చేసుకోవచ్చునని ఎమ్మెల్యే కాకాని స్కామ్కి తెరలేపారని ఆరోపించారు.
ఇప్పటికీ ఆనందయ్య నిర్బంధంలోనే ఉన్నారని...
వెబ్సైట్ విషయం ఆనందయ్యకు తెలియడంతో ఆయన ఎమ్మెల్యేకి ఫోన్ చేసి అభ్యంతరం చెప్పారని సోమిరెడ్డి అన్నారు. దాంతో ఆ వెబ్సైట్ను తొలగించాల్సి వచ్చిందన్నారు. అమెరికాలో ఉండే ఆనందయ్య చిన్న కుమారుడు సైతం దీనిపై స్పందించారని చెప్పారు. ఆ వెబ్సైట్కు తన తండ్రి ఆనందయ్యకు ఎటువంటి సంబంధం లేదని ఆయన ప్రకటన చేశారన్నారు. ఒకవేళ ఆనందయ్య మందును ఆన్లైన్లో పంపిణీ చేయాల్సి వస్తే అధికారిక వెబ్సైట్ తెరిచి పంపిణీ చేస్తామని చెప్పారన్నారు. ఇప్పటికీ ఆనందయ్య ప్రభుత్వ నిర్బంధంలోనే ఉన్నారని ఆరోపించారు. ఆయనకు స్వేచ్చ లేకుండా చేశారని అన్నారు. తెలంగాణ నుంచి ఆయన్ను సన్మానించడానికి యాదవ సంఘాలు వారు వస్తే పోలీసులు వారిపై లాఠీచార్జి చేశారని ఆరోపించారు.
నిరూపిస్తే ఉరేసుకుంటా : ఎమ్మెల్యే కాకాని
సోమిరెడ్డి ఆరోపణలపై ఎమ్మెల్యే కాకాని భగ్గుమన్నారు. ఆ ఆరోపణలు నిరూపిస్తే నడిరోడ్డులో తనకు తానే ఉరివేసుకునేందుకు సిద్దమని సవాల్ విసిరారు. దీనిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు తాను సిద్ధమని స్పష్టం చేశారు. దమ్ముంటే రా.. నువ్వో నేనో తేల్చుకుందామన్నారు. ఆనందయ్య మందుకు అనుమతి తీసుకురావడం కోసం తాము ఎంతో కష్టపడ్డామన్నారు. 'ఆయుర్వేదంలో ఆనందయ్యకు ఎంతో అనుభవం ఉంది. గతంలో కోవిడ్ నిబంధనలు పాటించలేదని పంపిణీ నిలిపివేశారు. ఎవరైనా ఆర్థిక సాయం చేయాలనుకుంటే.. నేరుగా ఆనందయ్యకే చేయవచ్చు. ప్రభుత్వానికి, వైసీపీకి ఆనందయ్య మందుతో సంబంధం లేదు. అన్ని జిల్లాలకు మందు పంపిణీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి.' అని గోవర్దన్ రెడ్డి తెలిపారు. ఆనందయ్య పంపిణీని నిలిపివేశారన్న ప్రచారంపై స్పందిస్తూ... ఆ మాట ఎవరెవరో చెబుతున్నారని,ఇప్పటికైతే ఆనందయ్య స్వయంగా ఎటువంటి ప్రకటన చేయలేదని అన్నారు.
Recommended Video
మందు పంపిణీకి బ్రేక్
మరోవైపు సోమవారం(జూన్ 7) నుంచి మందు పంపిణీ చేయలేమని ఆనందయ్య అనుచరులు వెల్లడించారు. రోజుకు 3,4వేల మందికి మాత్రమే ఇవ్వగలమని... 70,80వేల మందికి తమవల్ల కాదని అంటున్నారు. ప్రభుత్వ సహకారం లేనిదే అది సాధ్యం కాదని.. అందుకే మందు పంపిణీని నిలిపివేస్తున్నామని చెప్పారు. ఆర్థికవనరులు, ముడిపదార్థాలు సమకూర్చకుండా.. లక్షల మందికి మందు తయారీ తమ వల్ల కాదన్నారు. కాబట్టి ప్రజలెవరూ సోమవారం మందు కోసం కృష్ణపట్నం రావొద్దని విజ్ఞప్తి చేశారు.