టీడీపీలో సంచలనం.. చేతులు కలిపిన ఆ ఇద్దరు
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీట్లు ఆశించి దక్కించుకోలేని నాయకులను సీట్లు దక్కించుకున్న వారు కలిసి ఐకమత్యంగా కొనసాగుదామనే ప్రతిపాదనలను పెడుతున్నారు. తెలుగుదేశం పార్టీలో ఈ తరహాలోనే ఒక పరిణామం చోటుచేసుకుంది. అనంతపురం నుంచి టికెట్ దక్కించుకున్న దగ్గుపాటి ప్రసాద్ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి నివాసానికి వచ్చి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో కలిసి పనిచేద్దామని, సహకారం అందించాలని దగ్గుబాటి కోరారు.
ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ కూడా హాజరయ్యారు. అధికారం ఉన్నా లేకున్నా తామంతా తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడ్డామని ప్రభాకర్ అన్నారు. భవిష్యత్తులో కూడా పార్టీని వదులుకోబోమన్నారు. అధికారంలోకి రాగానే పనిచేసే కార్యకర్తలకే సాయం చేస్తామని చంద్రబాబు చెప్పారని గుర్తుచేశారు. వైసీపీ పాలనలో ఐదు సంవత్సరాలు పార్టీ కోసం పోరాడామని, చంద్రబాబు కోసమే కష్టపడ్డామని వ్యాఖ్యానించారు. నాయకులు, కార్యకర్తలతోపాటు తెలుగు మహిళలపై కూడా కేసులు పెట్టారన్నారు.

పార్టీ వీటిని గుర్తించాల్సి ఉందని, అధికారంలో ఉన్నప్పుడు అవినీతికి పాల్పడటంకానీ, భూకబ్జాలు చేయడంకానీ జరగలేదన్నారు. తాను డబ్బులు తీసుకున్నానంటూ కొందరు ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవలే చంద్రబాబు తనను పిలిపించి మాట్లాడారని, టికెట్ ఇతరులకు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో చెప్పారని, క్లిష్ట పరిస్థితుల్లో పార్టీ కోసం పనిచేయాలని తనకు సూచించినట్లు వెల్లడించారు. దగ్గుపాటి కూడా ప్రభాకర్ చౌదరి ఇంటికి వెళ్లి కలిసి పనిచేద్దామని కోరడంతో ఆయన కూడా పనిచేయడానికి సిద్ధమయ్యారు. అనంతపురం అర్బన్ టికెట్ను ప్రభాకర్ చౌదరి ఆశించినప్పటికీ అనూహ్యంగా దగ్గుపాటి ప్రసాద్కు కేటాయించారు. దగ్గుబాటిని కలుపుకు వెళ్లాలని, పార్టీ గెలుపునకు పనిచేయాలని, అధికారంలోకి రాగానే తప్పనిసరిగా న్యాయం చేస్తామని చంద్రబాబు ప్రభాకర్ చౌదరికి హామీ ఇవ్వడంతో ఆయన కూడా అంగీకరించారు.












Click it and Unblock the Notifications