వైసీపీ ఎమ్మెల్యే కుమారులపై హత్యాయత్నం కింద కేసు నమోదు: కేతిరెడ్డి పైనా అట్రాసిటీ
అనంతపురం: అనంతపురం జిల్లా తాడిపత్రిలో చోటు చేసుకున్న ఘర్షణల నేపథ్యంలో.. కేసు నమోదుల పర్వం ఆరంభమైంది. ఈ ఘర్షణకు కారణమైన కొందరు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరి కొందరిని అదుపులోకి తీసుకున్నారు. ఇదే ఘర్షణల్లో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై తాడిపత్రి వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా అధికార వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు పెట్టారు.
ఆయన ఇద్దరు కుమారులు హర్షవర్ధన్ రెడ్డి, సాయిప్రతాప్ రెడ్డిలపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. దీనితో ఈ ఘర్షణల వ్యవహారంలో ఇప్పటిదాకా 27 మందిపై కేసు పెట్టామని తాడిపత్రి డీఎస్పీ చైతన్య తెలిపారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి తరఫు న్యాయవాది శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేతిరెడ్డి, ఆయన కుమారులపై కేసు పెట్టినట్లు చెప్పారు. దాడుల సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి కారు డ్రైవర్ను కేతిరెడ్డి కులం పేరుతో దూషించారని శ్రీనివాస్ ఫిర్యాదు చేసినట్లు డీఎస్పీ పేర్కొన్నారు.
కేతిరెడ్డి పెద్దారెడ్డి భార్యపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం.. ఈ ఘర్షణకు దారి తీసింది. తన భార్యకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన వారు జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులనని భావించిన ఆయన.. జేసీ ఇంటిపైకి దాడి చేశారు. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనతో తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దాడులు ప్రతిదాడులతో అట్టుడికిపోయింది. పరిస్థితి చేయి దాటుతుందటంతో పోలీసులు 144 సెక్షన్ విధించారు. పలువురిపై కేసులు నమోదు చేశారు. ఆయా నేతల నివసానికి వెళ్లే దారిలో ఔట్పోస్టులను నెలకొల్పారు.
ఈ దాడుల ఘటనలో ఫిర్యాదులు, అరెస్టుల పర్వం కొనసాగవచ్చని తెలుస్తోంది. మరి కొంతమందిపై కేసులు నమోదు చేయడానికి అవకాశం ఉన్నట్లు సమాచారం. దాడులకు పాల్పడిన వారిని సీసీటీవీ ఫుటేజీల ద్వారా గుర్తిస్తున్నామని డీఎస్పీ పేర్కొన్నారు. తమపై భౌతిక దాడులకు పాల్పడటానికి కేతిరెడ్డి ప్రయత్నించాడని, ఇందులో భాగంగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు జేసీ కుటుంబం ఆరోపిస్తోంది. దీన్ని కేతిరెడ్డి వర్గీయులు తోసిపుచ్చుతున్నారు. ఉద్దేశపూరకంగా తమను రెచ్చగొట్టే చర్యలకు జేసీ అనుచరులు పాల్పడుతున్నారని విమర్శిస్తున్నారు.