ఒక్కో కరోనా పేషెంట్కు రోజూ రూ.350ల భోజనం: నాణ్యతలో నో కాంప్రమైజ్: గంధం చంద్రుడు
అనంతపురం: కోవిడ్ సోకిన ఒక వ్యక్తికి ప్రతి రోజు 350 రూపాయల వ్యయంతో పౌష్టికాహారాన్ని అందజేస్తున్నామని అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. కోవిడ్ పేషెంట్లు త్వరితగతిన కోలుకోవడానికి ఖర్చుకు వెనకాడట్లేదని, రోగనిరోధక శక్తి పెంచడానికి ఉపయోగ పడే ఆహారాన్ని అందిస్తున్నామని అన్నారు. కోవిడ్ పేషెంట్లకు పౌష్టికాహారాన్ని అందించడానికి జిల్లా పర్యాటక శాఖ అధికారులు అనంతపురం శివార్లలోని శిల్పారామంలో ప్రత్యేకంగా ఫుడ్ సెంటర్ను నెలకొల్పారు. ఈ కేంద్రాన్ని కలెక్టర్ గంధం చంద్రుడు సందర్శించారు. వివరాలను అడిగి తెలుసుకున్నారు.
కోవిడ్ 19 మెనూ ప్రకారం..
కరోనా పేషెంట్ల కోసం దాదాపు అన్ని శాఖలను భాగస్వామ్యులను చేస్తున్నామని గంధం చంద్రుడు తెలిపారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో మూడు కోవిడ్ ఆస్పత్రులు, మూడు కోవిడ్ కేర్ సెంటర్లలో ఆహారాన్ని అందిస్తున్నామని అన్నారు. ప్రతిరోజు 1800 మందికి పైగా కోవిడ్ పేషెంట్లకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని, రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని అందజేస్తున్నామని తెలిపారు. రోజూ ఉదయం, మధ్యాహ్నం, రాత్రి కోవిడ్ 19 మెనూ ప్రకారం ఆహారాన్ని తయారుచేసి అందిస్తున్నామని చెప్పారు.
1825 మందికి ఆహార సరఫరా..
అనంతపురం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి-580, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి-400 మందికి, కేన్సర్ ఆసుపత్రి-260, జేఎన్టీయూ కోవిడ్ కేర్ సెంటర్-330, శ్రీ చైతన్య జూనియర్ కళాశాల- 70, లేపాక్షి లోని బాలయోగి గురుకులంలో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్-185 మందికి కలిపి మొత్తం 1825 మందికి ఆహారాన్ని సరఫరా చేస్తున్నామని గంధం చంద్రుడు తెలిపారు. దీన్ని జిల్లా పర్యాటక శాఖ అధికారులు నిర్వహిస్తోన్నారని వివరించారు. ప్రతి రోజు ఉదయం 7 గంటలకు బెల్లం, పాలు కలిపి రాగిజావా, టిఫిన్ ఇస్తున్నామని చెప్పారు. మధ్యాహ్నం చికెన్ కర్రీ, అన్నం, చపాతి, వెజ్ కర్రీ, పప్పు కూర సరఫరా చేస్తున్నట్లు చెప్పారు.
పౌష్టికాహారంతో రికవరీ రేటు
సాయంత్రం 4:30 గంటలకు టీ, బిస్కెట్ అందిస్తున్నామని, రాత్రి భోజనంలో రెండు గుడ్లు అన్నం, చపాతీ, చట్నీ, వెజ్ కర్రీ ఇస్తున్నామని ఆయన తెలిపారు. ఆహారాన్ని ఎలాంటి ప్లాస్టిక్ వాడకం లేకుండా, పరిశుభ్రంగా ప్యాక్ చేసి పేషెంట్లకు అందజేస్తున్నట్లు గంధ: చంద్రుడు పేర్కొన్నారు. నాణ్యతలో రాజీపడబోమని స్పష్టం చేశారు. పర్యాటక శాఖ అధికారి దీపక్, అసిస్టెంట్ మేనేజర్ శ్రీధర్, కర్నూలు- అనంతపురం జిల్లాలకు కోవిడ్ కేర్ సెంటర్ల ఇంచార్జ్ బాబూజీలను జిల్లా కలెక్టర్ అభినందించారు. పౌష్టికాహారం వల్లే రికవరీ రేటు పెరుగుతుందని అన్నారు.
ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయంతో
కోవిడ్ సోకిన వారికి ఇలాగే నాణ్యత కలిగిన ఆహారాన్ని ఇకముందు కూడా సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. కోవిడ్ సోకిన వారికి అందించే భోజనం నాణ్యతతో ఉందా లేదా అని తనిఖీ చేశారు. భోజనాన్ని ప్యాకింగ్ చేసి అందించడం, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళలలో టిఫిన్, భోజనం మెనూ ప్రకారం అందిస్తున్నరా లేదని గిరిజన శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. కోవిడ్ సోకిన వారికి సరైన వేళలకు క్రమం తప్పకుండా నాణ్యత కలిగిన భోజనాన్ని సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు.