పవన్కళ్యాణ్పై కేసీఆర్ వ్యాఖ్య: కోర్టు 15రోజులు గడువు
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైన తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేసిన అనుచిత వ్యాఖ్యల కేసులో 15 రోజులలోగా విచారణ పూర్తి చేసి పూర్తి నివేదిక ఇవ్వాలని పోలీసులను అనంతపురం న్యాయస్థానం ఆదేశించింది.
పవన్ పైన కేసీఆర్ అనుచిత వ్యాఖ్యల కేసులో పక్షం రోజుల్లో పూర్తి నివేదిక ఇవ్వాలని అనంతపురం టూటౌన్ పోలీసులను ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు బుధవారం తమ తుది నివేదికను సమర్పించవలసి ఉంది. అయితే, తమకు మరికొంత సమయం కావాలని పోలీసులు కోర్టును కోరారు.
దీంతో కేసు నమోదు చేసిన న్యాయవాది మురళీ కృష్ణ వాదనను కోర్టు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి కేసీఆర్ పైన పలు సెక్షన్ల కింద నమోదయింది.
కాగా, ఎన్నికల ప్రచారంలో భాగంగా తెరాస అధ్యక్షులు, ప్రస్తుత తెలంగాణ సీఎం కే చంద్రశేఖర రావు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైన అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు చేశారు. దీనిని కోర్టు విచారిస్తోంది. ఇందులో భాగంగా పూర్తి నివేదికకు కోర్టు పోలీసులకు మరికొంత సమయం ఇచ్చింది.