అనంత రైతు పొలంలో బంగారు నాణేలు: పలుగు, పార పట్టుకుని జనం పరుగులు
అమరావతి: ఏపీలో కరువు జిల్లాగా పేరు గాంచిన అనంతపురం జిల్లా భూముల్లో బంగారు నాణేలు దొరుకుతున్నాయట. వివరాల్లోకి వెళితే అనంతపురం పట్టణానికి కూతవేటు దూరంలోని ఉప్పరిపల్లి గ్రామంలోని రైతు బిల్లే రాముడు పొలంలో ఓ వ్యక్తికి బంగారు నాణేలు దొరికాయి.
ఈ విషయం కాస్త విషయం కాస్త గ్రామస్థులందరి చెవినా పడటంతో అందరూ నాణేలను వెదికే పనిలోనే పడ్డారు. అంతేకాదు బంగారు నాణేలు ఉన్నాయన్న విషయం క్షణాల్లో జిల్లా వ్యాప్తంగా పాకింది. ఇప్పటి వరకు సుమారు 20 నాణేలు దొరికాయన్న వార్త తెలియడంతో జనం పలుగు, పార పట్టుకుని సదరు పొలానికి పరుగులు పెడుతున్నారు.
ఊళ్లో ఉన్నోళ్లు, పక్క ఊరి నుంచి వచ్చినోళ్లు అంతా మూకుమ్మడిగా మీదపడి ఊరిని, ఊరి చుట్టూ ఉన్న పొలాల్ని తవ్వేస్తున్నారు. ఆ నోటా, ఈ నోటా విషయం తెలుసున్న అధికారులు రంగంలోకి దిగిపోయారు. దీంతో బంగారు నాణేలు దొరికిన పొలంలోకి ఎవ్వరినీ రాకుండా కట్టడి చేశారు.
మరోవైపు ఇప్పటివరకు గ్రామస్థులకు దొరికిన బంగారు నాణేలను కొనుగోలు చేసేందుకు బంగారు వ్యాపారులు ఆ గ్రామానికి క్యూ కడుతున్నారు. ఒక్కో నాణేన్ని రూ. 3,500 నుంచి రూ. 5000 వరకు చెల్లించి నాణేలను కొనుగోలు వ్యాపారులు కొనుక్కుంటున్నారు.
గ్రాము నుంచి 3 గ్రాముల వరకూ బరువుండే బంగారు నాణేలు దొరుకుతున్నాయి. ఈ బంగారు నాణేలపై ఒకవైపు సీతారాముల బొమ్మ, లక్ష్మీదేవి బొమ్మ, ఆంజనేయుని బొమ్మ, వెంకటేశ్వరస్వామి బొమ్మ కనిపిస్తుండగా మరోవైపు శాసన లిపి ఉన్నాయి. పూర్వం ఈ ప్రాంతంలో రాజులు నివసించేవారని, అందుకే బంగారు నాణేలు దొరుకుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.
ఈ బంగారం అంతా వెలకట్టలేనిదని కొందరు విశ్లేషిస్తున్నారు. విజయనగర రాజుల నాటి నాణేలని, ఆ చిహ్నాలే వీటిలో కనిపిస్తున్నాయని కొందరు పురావస్తు శాస్ర్తజ్ఞులు చెబుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆర్డీవో, పూర్తి స్థాయిలో విచారణ చేసి మొత్తం నాణేలను రికవరీ చేస్తామని తెలిపారు.