వైఎస్సార్కు కొత్త అర్థం చెప్పిన షర్మిల- ఈ పేర్ల గోల ఏంటో
YS Sharmila: ఏపీలో కాంగ్రెస్కు పూర్వవైభవాన్ని కల్పించే దిశగా పీసీసీ అధినేత్రి వైఎస్ షర్మిల.. కసరత్తు సాగిస్తోన్నారు. త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల కోసం పార్టీ క్యాడర్ను సిద్ధం చేస్తోన్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఉనికిని కోల్పోయిన ఈ గ్రాండ్ ఓల్డ్ పార్టీకి ఊపిరి పోసే ప్రయత్నాల్లో ఉన్నారు.
ఇందులో భాగంగా జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు షర్మిల. వరుసబెట్టి కాంగ్రెస్ మాజీ నేతలను కలుసుకుంటోన్నారు. క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకొన్న వారినీ కలుస్తోన్నారు. మళ్లీ పార్టీలో చేరాలంటూ ఆహ్వానిస్తోన్నారు. ఈ క్రమంలో- తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనే కార్డ్ను ఉపయోగించుకుంటోన్నారామె.

అదే సమయంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకున్నారు. ఆ పార్టీని నడిపిస్తోన్నది, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నదీ తన సొంత అన్నే అయినప్పటికీ.. లెక్క చేయట్లేదు. తన రాజకీయ ప్రత్యర్థిగానే చూస్తోన్నారు. మాటల దాడికి దిగుతున్నారు. దాని తీవ్రతను తగ్గించట్లేదు.
వైఎస్సార్- వైఎస్ జగన్ మధ్య పోలికలను తీసుకొస్తోన్నారు. తండ్రి పాలనకు- అన్న పాలనకు చాలా వ్యత్యాసం ఉందంటూ లోపాలను ఎత్తి చూపుతున్నారు. ప్రత్యేక హోదా అంశాన్నీ ప్రస్తావిస్తోన్నారామె. బీజేపీతో దోస్తీ కోసం వైఎస్ జగన్- చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజల హక్కులను కేంద్ర ప్రభుత్వం వద్ద తాకట్టు పెట్టారంటూ విమర్శిస్తోన్నారు.
ఇప్పుడున్నది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కాదని, ఆ పార్టీలో వైఎస్సార్ లేరనీ చెబుతున్నారు. వైఎస్సార్ అనే పేరుకు కొత్త అర్థాన్ని ఇచ్చారు. వై- వైవీ సుబ్బారెడ్డి, ఎస్- సాయిరెడ్డి, ఆర్- రామకృష్ణా రెడ్డి అంటూ విడమరిచి చెప్పారు. వైఎస్సార్ది మాత్రం కాంగ్రెస్ పార్టీనే అంటూ వివరించారు షర్మిల.
వైఎస్ఆర్సీపీలో వైఎస్సార్ లేడని, అది జగన్ రెడ్డి పార్టీ అని విమర్శించారు. ప్రజలను పట్టించుకోని, ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టే పార్టీగా అభివర్ణించారు. వైఎస్సార్ ఆశయాలను నిలబెట్టని పార్టీ అంటూ మండిపడ్డారు. బీజేపీకి బానిసగా మారిన పార్టీగా ఆరోపణలను గుప్పించారు.












Click it and Unblock the Notifications