వంద కోట్ల కథ: చంద్రబాబుపై టైమ్స్ నౌ కథనం సంచలనం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై టైమ్స్ నౌ అనే ఆంగ్ల టీవీ చానెల్ ప్రసారం చేసిన వార్తాకథనం సంచలనం సృష్టిస్తోంది. రాష్ట్ర విభజనతో రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిందని చెబుతున్న చంద్రబాబు తన పర్యటనలకు, ఇతరత్రా పనులకు వంద కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశారని ఆ న్యూస్ చానెల్ ఆరోపించింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టిన ఖర్చులకు సంబంధించిన ఆధారాలు, అందుకు సంబంధించిన పత్రాలు తమ వద్ద ఉన్నాయని చానెల్ చెప్పుకుంది.
ప్రముఖ ఆంగ్ల న్యూస్ ఛానెల్ టైమ్స్ నౌ ‘యువర్ మనీ... మై లగ్జరీ' పేరిట చంద్రబాబుపై ప్రత్యేక వార్తా కథనాన్ని ప్రసారం చేసింది. ‘‘ఐయామ్ ఏ వీవీఐపీ. యువర్ మనీ ఈజ్ మైన్. వన్ ఇయర్.. 100 క్రోర్. 91 శాతం మంది రైతులు రుణాల్లో కూరుకుపోయారు'' మొదలైన ఉప శీర్షికలతో ప్రసారం చేసిన కథనం రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగానూ సంచలనం సృష్టించింది.
ఏపీపై 1.46 కోట్ల రుణ భారం పడిందని, రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని కేంద్రం వద్ద వాదించిన సీఎం నారా చంద్రబాబునాయుడు, కేంద్రం సాయం చేస్తే గట్టెక్కలేమని చెబుతున్నారు. ఇతర పక్క రాష్ట్రాలకు సమానంగా ఎపి అభివృద్ధి చెందే వరకు కేంద్రం తమకు సాయం అందించాల్సిందేనని అంటున్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటనపై కేంద్రం వెనకడుగు వేయడాన్ని కూడా చంద్రబాబు తప్పు పట్టారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని బహిరంగంగానే విమర్శించారు. అయితే, చంద్రబాబుపై టైమ్స్ నౌ విరుచుకుపడింది.
రాష్ట్రం అప్పుల్లో ఉంటే, చంద్రబాబు మాత్రం వీవీఐపీ లగ్జరీని అనుభవిస్తున్నారని, రాష్ట్రం ఏర్పడిన ఏడాదిలోగానే ఆయన తన కోసం దాదాపు రూ.100 కోట్లను ఖర్చు చేశారని వ్యాఖ్యానించింది. దీనిపై పర్యటనలు ప్రత్యేక చార్టర్ విమానాలు, హెలికాప్టర్లు, కాన్వాయ్ లో కొత్త వాహనాలు, విదేశీ పర్యటనల పేరిట ఆయన ఈ వంద కోట్ల రూపాయలను దుబారా చేశారని ఆ ఛానెల్ ఆరోపించింది.