ఆ రూల్ పక్కనబెట్టేసిన జగన్... ప్రత్యర్దులకు లైన్ క్లియర్... ఇక జాతర తప్పదా ?
గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విశ్వసనీయత పేరుతో ప్రత్యర్ధి పార్టీల నేతలను రాజీనామాలు చేశాకే వైసీపీలోకి రావాలనే నిబంధన పెట్టిన జగన్ తాజాగా దాన్ని పక్కనబెట్టేశారు. టీడీపీకి చెందిన ఎమ్మెల్సీలు డొక్కా మాణిక్యవరప్రసాద్, శమంతకమణిని రాజీనామాలు ఆమోదం పొందకుండానే వైసీపీలోకి చేర్చుకుని కండువాలు కప్పేశారు. దీంతో ఇదే బాటలో మరికొందరు విపక్ష పార్టీల నేతలు వైసీపీలోకి వచ్చేందుకు తమకు లైన్ క్లియర్ అయిందని భావిస్తున్నారు.

విపక్షంలో ఉన్నప్పుడు విశ్వసనీయత...
2014 ఎన్నికల్లో 67 మంది ఎమ్మెల్యేలను తన పార్టీ గుర్తుపై గెలిపించుకున్న జగన్, ఆ తర్వాత వీరిలో 23 మందిని చంద్రబాబు అభివృద్ధి పేరుతో టీడీపీలోకి తీసుకున్నప్పుడు అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. సంతలో పశువుల్లా ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని, కోట్ల రూపాయలకు ఎమ్మెల్యేలు అమ్ముడుపోవడం దారుణమని మండిపడ్డారు.
అలా టీడీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యేల్లో నలుగురిని మంత్రులుగా చేయడంపైనా జగన్ తీవ్ర పోరాటం చేశారు. టీడీపీ వ్యవహారశైలిని నిరసిస్తూ ఏకంగా అసెంబ్లీ సమావేశాలను నిరవధికంగా బహిష్కరించారు. టీడీపీ చేసిన తప్పిదం తాము చేయబోమని, వైసీపీలోకి వచ్చే ప్రజా ప్రతినిధులు ఎవరైనా తమ పదవులకు రాజీనామాలు చేయడంతో పాటు వాటిని ఆమోదించుకుని రావాల్సిందేనని నిబంధన పెట్టారు.

రాజీనామా తర్వాతే వైసీపీలో చేరికలు..
టీడీపీ తరఫున ఎమ్మెల్సీగా గెలిచిన శిల్పా చక్రపాణిరెడ్డిని నంద్యాల ఉపఎన్నికల సందర్భంగా వైసీపీలోకి చేర్చుకోవాల్సి వచ్చినప్పుడు ఆయన రాజీనామా కోరారు జగన్. జగన్ పెట్టిన నిబంధనతో మూడు నెలల ముందే ఎమ్మెల్సీగా గెలిచిన చక్రపాణిరెడ్డి దాదాపు ఆరేళ్ల పదవీకాలాన్ని వదులుకుని పదవికి రాజీనామా చేశారు. జగన్ ముందే రాజీనామా పత్రాన్ని చూపిస్తూ తాను విశ్వసనీయత కోసం పదవులను త్యాగం చేసినట్లు చెప్పుకున్నారు. ఆ తర్వాత ఆయన్ను జగన్ ఎమ్మెల్యే సీటు ఇచ్చి అసెంబ్లీకి గెలిపించుకున్నారు. ఆ తర్వాత కూడా వైసీపీలోకి వచ్చే ప్రజాప్రతినిధులంతా ఇదే నిబంధన పాటించాకే వారికి ఆహ్వానం లభించింది.

అధికారంలోకి వచ్చాక ఏమైంది ?
విపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యర్ధి పార్టీల నేతలను రాజీనామాలు చేసి రావాలని నిబంధన పెట్టిన జగన్.. తాజాగా ఏఫీలో స్ధానిక పోరు మొదలయ్యాక ఈ నిబంధనను పూర్తిగా పక్కనబెట్టేశారు. ఎమ్మెల్యేలు తప్ప మిగతా పదవుల్లో ఉన్న వారు వైసీపీలోకి చేరేందుకు ఆసక్తి చూపినప్పుడు వారి నుంచి రాజీనామాలు కోరకుండానే కండువాలు కప్పేస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్సీలు డొక్కా మాణిక్య వరప్రసాద్, శమంతకమణి ఇదే బాటలో రాజీనామాలు ఆమోదం పొందకముందే వైసీపీ కండువాలు కప్పుకున్నారు. దీంతో జగన్ పెట్టిన నిబంధనతో పాటు ఆయన విశ్వసనీయత కూడా ప్రశ్నార్ధకమైంది.
Recommended Video

జగన్ ఇలా చేస్తారని తెలిస్తే... వారంతా..
తమ పదవులు వదులుకోకపోయినా వైసీపీలోకి జగన్ తీసుకుంటారని తెలిస్తే టీడీపీ, జనసేన, బీజేపీకి చెందిన పలువురు కీలక నేతలు ఇప్పటికే పార్టీలు ఫిరాయించేవారు. వైసీపీ అధికారంలోకి రాకముందు, అధికారంలోకి వచ్చాక కూడా విపక్ష పార్టీలకు చెందిన పలువురు నేతలు వైసీపీలోకి వస్తామని జగన్ కు సంకేతాలు పంపారు. అయితే వెంటనే జగన్ నుంచి స్పందన రాకపోవడంతో రాజీనామా నిబంధన వల్లే అనుకుని సైలెంట్ అయిపోయారు. కానీ తాజాగా జగన్ డొక్కా మాణిక్యవరప్రసాద్,శమంతకమణి వంటి నేతలను పార్టీలోకి చేర్చుకున్న తీరును చూసి వారంతా ఇప్పుడు ముక్కున వేలేసుకుంటున్నారు. పదవులు త్యజించకపోయినా జగన్ వైసీపీలోకి తీసుకుంటారని తెలిస్తే ఆ పార్టీలో ఎవరో ఒకరిని పట్టుకుని ఇప్పటికే ఫిరాయించే వారమంటూ వీరంతా ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ తమకు ఎప్పుడు అవకాశమొస్తందా అని ఎదురు చూస్తున్నారు












Click it and Unblock the Notifications