కేంద్ర ప్రభుత్వంపై సిఎం చంద్రబాబు మరో లేఖాస్త్రం:పోలవరం నిధుల గురించి గడ్కరీకి లెటర్
Recommended Video
అమరావతి:కేంద్రం ప్రభుత్వంపై ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా మరో లేఖాస్త్రం సంధించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు గురించి కేంద్ర జలవనరుల శాఖా మంత్రి నితిన్ గడ్కరీకి ఆయన ఈ లేఖ రాశారు.
ఈ ప్రాజెక్ట్ సకాలంలో పూర్తయేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలంటూ గడ్కరీకి రాసిన లేఖలో సిఎం చంద్రబాబు కోరారు. పోలవరం నిర్మాణం తో పాటు నిర్వాసితుల కోసం నిధులు విడుదల చేయాలని చంద్రబాబు ఆ లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే తమ ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.1935 కోట్లు తక్షణమే విడుదల చేయాలన్నారు.
కేంద్రానికి...చంద్రబాబు లేఖ
కేంద్ర జలవనరుల శాఖా మంత్రి నితిన్ గడ్కరీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా మరో లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్ట్ ను తాము అనుకున్న సమయంలోపే పూర్తిచేసేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని ఆయన ఆ లేఖలో కోరారు. పోలవరం ఖర్చంతా తామే భరిస్తామన్న హామీకి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయాలని చంద్రబాబు కోరారు.
ఖర్చు...వివరాలు ఇవి
పోలవరం ప్రాజెక్ట్ కు ఈ ఏడాది మే నెలాఖరు నాటికి రూ.13,798.54 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిందని సీఎం చంద్రబాబు తన లేఖలో వివరించారు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాక 8,662.67 కోట్లు ఖర్చు చేస్తే కేంద్రం మాత్రం రూ.6,727.26 కోట్లు మాత్రమే అందించిందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తుచేశారు. అందువల్ల తమకి కేంద్రం నుంచి మరో 1935.41 కోట్లు రావాల్సి ఉందని చంద్రబాబు తెలిపారు.
వెంటనే...విడుదల చేయండి
రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ కోసం ఖర్చుచేసిన నిధులతో పాటు మరో రూ.10వేల కోట్లు వెంటనే విడుదల చేయాలని సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. పోలవరం నిర్మాణం, భూసేకరణ పరిహారం కోసం రూ.10వేల కోట్లు అవసరమని చంద్రబాబు పేర్కొన్నారు. నిధులు విడుదలలో ఎలాంటి జాప్యం లేదని రాష్ట్రంలో పదే పదే ప్రకటిస్తున్న బీజేపీ నేతల వైఖరిని చంద్రబాబు తీవ్రంగా తప్పుబట్టారు.
ప్రాజెక్టులపై...సమీక్ష
పోలవరం సహా 54 ప్రాధాన్యం కల్గిన ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టులో భాగమైన అప్స్ట్రీమ్ జెడ్ గ్రౌండింగ్ పనులు పూర్తయినట్టు ఈ సమావేశంలో ప్రకటించారు. జులై 9నాటికి డౌన్ స్ట్రీమ్జెడ్ గ్రౌండింగ్పనుల్ని కూడా పూర్తిచేయాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా రాష్ట్ర జలవనరుల శాఖకు 19 స్కోచ్ అవార్డులు రావడంపై అధికారులు, ఉద్యోగులకు సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు.