ఎ ఫేస్ బుక్ లవ్ స్టోరీ:ఆంధ్రా అమ్మాయి-తెలంగాణ అబ్బాయి;పెళ్లి చేసుకున్నాం-రక్షణ కావాలి
గూడూరు: ఆ అమ్మాయిది ఆంధ్రప్రదేశ్...అబ్బాయిది తెలంగాణ..ఇద్దరి మధ్య ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది...అది ప్రేమగా మారింది. కట్ చేస్తే...ఒక ఫైన్ డే...పెద్దలకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నారు...అయితే ఈ ప్రేమపెళ్లితో పెద్దల నుంచి ప్రాణహాని ఉండొచ్చని భయపడిన వీళ్లు రక్షణ కోసం పోలీసులను ఆశ్రయించారు. దీంతో వీరి లవ్ మ్యారేజ్ మీడియా కెక్కింది.
ప్రేమికులు చెప్పిన వివరాల ప్రకారం...కడప జిల్లాకు చెందిన పల్లా నాగశుభవాణి నర్సింగ్ కాలేజీలో మొదటి సంవత్సరం ట్రైనింగ్ చదువుతోంది. ఈమెకు మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం బొద్దుగొండ గ్రామానికి చెందిన మట్టా నరేష్తో ఫేస్ బుక్ ద్వారా పరిచయం అయింది. పెయింటింగ్స్ వేస్తూ ఫేస్బుక్ లో పోస్ట్ చేసే మట్టా నరేష్ తన ఆర్ట్ ద్వారా నాగశుభవాణిని ఆకట్టుకున్నాడు. అలా పరిచయం ఫోన్ల వరకు విస్తరించి సంవత్సర కాలం నుంచి ఫోన్లు చేసుకుంటూ ప్రేమలో పడ్డారు. వివాహం చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు.
ఈ నేపథ్యంలో ఈ నెల 16 వ తేదీన నరేష్ కడపకు వెళ్లి నర్సింగ్ కాలేజీ నుంచి నాగశుభవాణిని తీసుకొని వరంగల్కు వెళ్లిపోయాడు. ఆ తర్వాత 21న మహబూబాబాద్కు చేరుకొని పెళ్లి చేసుకున్నట్లు ఈ ప్రేమికులు చెబుతున్నారు. అయితే తాము పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోవడంతో తమ ప్రాణాలకు హాని ఉందని, పైగా తమది కులాంతర వివాహమని, రక్షణ కల్పించాలని సోమవారం మహబూబాబాద్ పోలీస్ స్టేషన్కు వెళ్లి పోలీసులను వేడుకున్నారు.
మరోవైపు నాగ శుభవాణి తప్పిపోయినట్లు ఆమె తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని ఈ ప్రేమికులకు తెలియడంతో వీరి ఆందోళన మరింత పెరిగింది. దీంతో పెద్దల నుంచి తమకు హాని ఉండొచ్చని ప్రేమజంట పోలీసులకు తెలిపారు. ప్రేమికుల వినతి మేరకు నరేష్ బంధువులకు ఈ సమాచారం అందించి విచారిస్తున్నట్లు మహబూబాబాద్ ఎస్సై రామారావు తెలిపారు.