రాజధాని అమరావతిలో మరో భారీ నిర్మాణం- నిధులు మంజూరు: అనేక షరతులు
రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక అడుగు పడింది. అమరావతి ప్రభుత్వ కాంప్లెక్స్ పరిధిలో లోక్ భవన్ భవన సముదాయాల నిర్మాణానికి ప్రభుత్వం పరిపాలనా పరమైన అనుమతులు మంజూరు చేసింది. దీనికోసం 212. 22 కోట్ల రూపాయలను కేటాయిస్తూ ఆర్థిక శాఖ ఇదివరకే అనుమతులు ఇవ్వగా.. తాజాగా ప్రభుత్వం దీనికి తుది ఆమోదం తెలిపింది. రాజధాని ప్రాంతంలో శాశ్వత ప్రభుత్వ నిర్మాణాలను వేగవంతం చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.
నూతనంగా నిర్మించబోయే ఈ లోక్ భవన్ సముదాయంలో అత్యున్నత స్థాయి వసతులను కల్పించనున్నారు. ప్రధానంగా గవర్నర్ మ్యాన్షన్, అసెంబ్లీ దర్బార్ హాల్, కార్యాలయం, రెండు అతిథి గృహాలు ఇందులో నిర్మితం కానున్నాయి. అలాగే.. లోక్ భవన్ అధికారులు, సహాయక సిబ్బంది కోసం క్వార్టర్లు కూడా ఈ కాంప్లెక్స్ పరిధిలోనే అందుబాటులోకి రానున్నాయి. వీటిల్లో ఆఫీసర్ క్వార్టర్స్- 6, సీనియర్ స్టాఫ్ క్వార్టర్స్- 10, జూనియర్ స్టాఫ్ క్వార్టర్స్- 12, సహాయక సిబ్బంది క్వార్టర్స్- 40 ఉంటాయి.

20 గదులతో కూడిన బ్యారక్స్ నిర్మితం కానున్నాయి. ఇందులో దాదాపు 144 మంది రక్షణ సిబ్బందికి వసతి కల్పిస్తారు. నాలుగు సెంటినల్ పోస్టులతో కూడిన కాంపౌండ్ వాల్, ఇతర అనుబంధ చెక్ పాయింట్స్ కూడా ఈ నివాస సముదాయం పరిధిలో నిర్మించనున్నారు. ఆర్సీసీ పద్ధతిలో అత్యాధునిక ప్రమాణాలతో ఈ సముదాయం రూపుదిద్దుకోనుంది.
ఈ నిర్మాణానికి నిధులు మంజూరు చేసినప్పటికీ.. ఆర్థిక శాఖ కొన్ని షరతులను విధించింది. నిర్మాణ వ్యయం మొత్తం కూడా రూ. 212.22 కోట్ల పరిమితిని ఎట్టి పరిస్థితుల్లోనూ మించకూడదు. దీనిలోపే నిర్మాణం పూర్తి కావాల్సి ఉంటుంది. దీనికి మించి ఎలాంటి అదనపు ఆర్థిక భారాన్ని మోపడానికి వీల్లేదని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. దీనికి అయ్యే మొత్తం వ్యయాన్ని సీఆర్డీఏ భరించాల్సి ఉంటుంది. తన వద్ద అందుబాటులో ఉన్న నిధుల నుంచే సర్దుబాటు చేయాలని పేర్కొంది.
ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయింపులు కోరకూడదని సూచించింది. సాంకేతిక అనుమతులు, టెండర్ ప్రక్రియకు అయ్యే ఖర్చు అన్నీ కూడా ఈ 212 కోట్ల రూపాయల్లోపే ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పనులలో ఏవైనా నిధులు మిగిలితే, వాటిని ఇతర పనులకు మళ్లించడానికి కూడా వీల్లేదు. ముందస్తు అనుమతి లేకుండా ప్రాజెక్ట్ పరిధిని పెంచడం గానీ, అదనపు పనులను చేర్చడం లేదా సవరించిన అంచనాలతో ఎక్కువ ఆర్థిక భారాన్ని మోపడం వంటి చర్యలకు అనుమతులు ఇవ్వట్లేదని తేల్చి చెప్పింది.
నిర్మాణం పూర్తయిన తర్వాత భవిష్యత్తులో వచ్చే నిర్వహణ ఖర్చులు, మరమ్మతులు, ఇతర రోజువారీ నిర్వహణ వ్యయాలను కూడా ప్రభుత్వ నిధుల నుండి నేరుగా చెల్లించడానికి వీల్లేదు. వీటి కోసం ముందుగానే ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications