ఏపీ-తెలంగాణ మధ్య మరో దుష్ప్రచారం: ఏపీ బస్సులకు అనుమతి ఇవ్వని తెలంగాణ
అమరావతి: ఏపీ తెలంగాణ మధ్య ఏర్పాటు చేసిన సరిహద్దు చెక్పోస్టులను సోమవారం నుంచి ఎత్తేస్తారంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని తేలింది. ఈ వార్తలను నమ్మొద్దంటూ ఏపీ అధికారులు వెల్లడించారు. రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్పోస్టులను ఎత్తేస్తారనే వార్తలు నిరాధారమైనవని స్పష్టం చేశారు. చెక్పోస్టులు యధాతథంగా కొనసాగుతాయని పేర్కొన్నారు. ఈ మేరకు రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి, కోవిడ్ టాస్క్ఫోర్స్ ఛైర్మన్ ఎంటీ కృష్ణబాబు ఓ ప్రకటన చేశారు.
చెక్పోస్టులు యధాతథం
రాష్ట్ర సరిహద్దుల్లో చెక్ పాయింట్లను రేపటి నుంచి తొలగిస్తున్నట్లు వస్తున్న ప్రచారం అవాస్తవమని అన్నారు. సరిహద్దుల వద్ద చెక్ పోస్టులను తొలగించే నిర్ణయమేదీ ప్రభుత్వం తీసుకోలేదని చెప్పారు. కొవిడ్ ఆర్డర్ 55 ప్రకారం చెక్పోస్టులను యధాతథంగా కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నందున సరిహద్దులు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల్లో మరికొంత కాలం ప్రవేశాలను నియంత్రిస్తామని కృష్ణబాబు తేల్చి చెప్పారు.
ఆ ఆరు రాష్ట్రాల నుంచి వచ్చేవారికి..
ఎవరైనా రాష్ట్రంలోకి రావాలంటే స్పందన యాప్లో వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుందని, రాష్ట్రానికి వచ్చే వారందరికీ వైద్య ఆరోగ్య శాఖ నిబంధనల ప్రకారం తప్పనిసరిగా కరోనా పరీక్షలు నిర్వహిస్తామని అన్నారు. ఇందులో ఎలాంటి మార్పుల్లేవని చెప్పారు. ఎక్కువ కరోనా కేసులున్న ఆరు రాష్ట్రాల నుంచి వచ్చే వారు ఏడు రోజుల పాటు సంస్థాగత క్వారంటైన్లో ఉండాల్సిందేనని అన్నారు. తమిళనాడు, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ నుంచి ఏపీకి వచ్చేవారెవరైనా వారం రోజుల పాటు సంస్థాగత క్వారంటైన్ ఉండాలని అన్నారు.
ఏపీ బస్సులకు అనుమతి ఇవ్వని తెలంగాణ
తెలంగాణకు బస్సులు నడపడానికి ఆ రాష్ట్రం ఇంకా అనుమతి ఇవ్వలేదని పేర్కొన్నారు. అక్కడి నుంచి అనుమతి లభిస్తే రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్కు బస్సులు నడిపేందుకు ఆర్టీసీ సిద్ధంగా ఉందని కృష్ణబాబు వివరించారు. అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులను పునరుద్ధరించడానికి తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల రవాణాశాఖ అధికారులకు లేఖలు రాశామని అన్నారు. అంతరాష్ట్ర రాక పోకలు సంబంధించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను అవాస్తవమని తేల్చారు.
Recommended Video
స్పందనలో పేరు నమోదు..
ఎవరైనా పొరుగు రాష్ట్రం నుంచి రావాలనుకుంటే తప్పనిసరిగా స్పందన వెబ్సైట్లో పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుందని అన్నారు. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగుల చెక్ పోస్ట్ ద్వారా మాత్రమే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి అనుమతి ఉందని, నాగార్జున సాగర్ వైపు నుంచి ఏపీ సరిహద్దుల్లోకి ప్రవేశించడానికి రావడానికి అనుమతి లేదని అన్నారు. పొందుగల చెక్పోస్ట్ వద్ద ఏర్పాటు చేసిన కోవిడ్ కమాండ్ పాయింట్ వద్ద స్పందన రిజిస్ట్రేషన్ సెంటర్ ఏర్పాటు చేశామని చెప్పారు. పొరుగు రాష్ట్రాల నుంచి ఏపీలో ప్రవేశించే వారికి ఎలాంటి ఆంక్షలు లేవంటూ, చెక్పోస్టులు ఎత్తేస్తారంటూ వస్తోన్న వార్తలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తాయని అన్నారు.