ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీపై ఆదేశాలు: డెడ్ లైన్
Chandrababu: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. పరిపాలనలో వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టింది. వాట్సప్ గవర్నెన్స్ను ప్రవేశపెట్టింది. దీన్ని విజయవంతంగా అమలు చేస్తోంది.
శ్రమ ఇక తప్పింది..
వివిధ రకాల సేవలు, సర్టిఫికెట్ల కోసం సంబంధిత కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన శ్రమ ఇక తప్పినట్టయింది. అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ పాలనాపరమైన సంస్కరణలకు చంద్రబాబు- పవన్ కల్యాణ్ సర్కార్ తెర తీసింది. ఈ క్రమంలో కిందట నెల 18వ తేదీన వాట్సప్ గవర్నెన్స్ను ప్రారంభించింది.

500లకు పెంచాలంటూ
దీన్ని మరింత విస్తరించాలని చంద్రబాబు నిర్ణయించారు. ప్రస్తుతం వాట్సప్ ద్వారా 161 రకాల సేవలు అందుబాటులో ఉంటోన్నాయి. వీటిని 500లకు పెంచాలంటూ ఆయన అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. అన్ని మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ మేరకు వారికి సూచనలు ఇచ్చారు.
వాట్సప్ ద్వారానే..
అన్ని రకాల సేవలు కూడా వాట్సప్ ద్వారానే ప్రజలకు అందజేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు తేల్చి చెప్పారు. దీనివల్ల ప్రజలకు మరింత పారదర్శకంగా, వేగవంతంగా సేవలను అందించినట్టవుతుందని అన్నారు. దళారీ వ్యవస్థను రూపుమాపినట్టవుతుందని, ఫలితంగా అవినీతి ఉండదని చంద్రబాబు స్పష్టం చేశారు.
వచ్చే 45 రోజుల్లో 500 రకాల సేవలు..
వచ్చే 45 రోజుల్లో 500 రకాల సేవలను ప్రజలకు అందించేలా కసరత్తు పూర్తి చేయాలని చంద్రబాబు చెప్పారు. మూడు నుండి ఆరు నెలల్లో మొత్తం ప్రభుత్వ సేవల వ్యవస్థ కూడా వాట్సాప్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆయన అన్నారు. మన మిత్ర ప్లాట్ఫామ్కు 500 కంటే ఎక్కువ సేవలను జోడించడానికి 45 రోజుల గడువును విధించారాయన.
టీటీడీ, రైల్వేలు..
రాష్ట్రంలో ఇప్పటివరకు వాట్సప్ గవర్నెన్స్ ద్వారా ఇప్పటి వరకు 2.64 లక్షల లావాదేవీలు జరిగినట్లు చంద్రబాబు చెప్పారు. త్వరలోనే తిరుమల తిరుపతి దేవస్థానం, రైల్వే సేవలను కూడా దీని ద్వారానే అందిస్తామని అన్నారు. 35 శాతం సర్వర్ సమస్యలు వస్తున్నాయని, ఆయా శాఖలు వాటిని పరిష్కరించుకోవాలని సూచించారు.

లావాదేవీలు ఇలా..
ఈ 2.64 లక్షల లావాదేవీల్లో 1,10,761 సేవలు ఆర్థిక పరమైనవి. 1,14,119 సేవలు వివిధ శాఖలకు సంబంధించిన సమాచారాలకు సంబంధించినవి. విద్యా శాఖలో అత్యధికంగా 82,938 లావాదేవీలు రికార్డయ్యాయి. ప్రస్తుతం- 85 శాతం కార్యకలాపాలు పూర్తయ్యాయని, సర్వర్ సమస్యల వల్ల 35 శాతం పెండింగ్లో ఉంటోన్నాయి.
క్యూఆర్ కోడ్తో..
కొత్త రేషన్ కార్డులను కూడా వాట్సప్ ద్వారానే జారీ చేయాలని ఐటీ శాఖ మంత్ర నారా లోకేష్ అధికారులకు సూచించారు. క్యూఆర్ కోడ్ ద్వారా డిజిటల్ రేషన్ కార్డులు అందిస్తామని వెల్లడించారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. 45 రోజుల్లోనే ఈ కసరత్తు పూర్తి కావాలని చెప్పారు.












Click it and Unblock the Notifications