అలిగిన పవన్?-ఫలించని నారాయణ రాయబారం.! అమరావతి వదిలి విశాఖకు..!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan kalyan) మరోసారి అలిగారా ? సీఎం చంద్రబాబుతో పాటు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు (Amaravati Seed Access Road) ప్రారంభోత్సవ కార్యక్రమానికి అందుకే దూరంగా ఉన్నారా ? నిన్న మంత్రి నారాయణ స్వయంగా వెళ్లి ఆహ్వానించినా పవన్ కోపం తగ్గలేదా ?, అందుకే ఇవాళ విశాఖలో ఏనుగుల దినోత్సవ కార్యక్రమానికి వెళ్లిపోయారా ? ఇప్పుడు అమరావతిలో ఇదే చర్చ జరుగుతోంది.
ఇవాళ అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డుతో పాటు పలు ప్రభుత్వ భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోంది. వీటికి సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు కూడా హాజరయ్యారు. వీటికి రావాలని ప్రభుత్వం అధికారికంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కూడా ఆహ్వానం పంపింది. అయినా ఆయన మాత్రం హాజరు కాకపోవడం అనుమానాలకు తావిస్తోంది. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ ఇంత కీలకమైన కార్యక్రమానికి రాకపోవడం ఏంటన్న చర్చ జరుగుతోంది.

ఇవాళ అమరావతి స్టీల్ బ్రిడ్జ్, ఎమ్మెల్యేల క్వార్టర్లు, సీడ్ యాక్సిస్ రోడ్డును సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అయితే ఈ కార్యక్రమాలన్నీ ముందుగానే తెలిసినా పవన్ మాత్రం.. ఉదయాన్నే విశాఖలో మరో కార్యక్రమం పెట్టుకుని వెళ్లిపోయారు. నిన్న పవన్ తో రాయబారానికి మంత్రి నారాయణ వెళ్లి చర్చించినట్లు తెలుస్తోంది. అయినా పవన్ కళ్యాణ్ మాత్రం వెనక్కి తగ్గలేదు. దీనికి బదులు విశాఖపట్నంలో నిర్వహించిన ఏనుగుల దినోత్సవంలో పవన్ పాల్గొన్నారు. ఇప్పటికే అమరావతిలో జరిగిన గత మూడు కేబినెట్ భేటీలకు పవన్ కళ్యాణ్ వివిధ కారణాలతో దూరంగా ఉన్నారు. ఇప్పుడు అదే అమరావతిలో కీలకమైన రోడ్డు, భవనాల ప్రారంభోత్సవానికి పవన్ రాకపోవడం చర్చనీయాంశమైంది. దీనిపై కూటమి పార్టీలన్నీ మౌనంగా ఉన్నాయి.













Click it and Unblock the Notifications