వైసీసీ ప్రభుత్వాన్ని సవాల్ చేస్తోన్న ఆ కీలక సమస్య పరిష్కారానికి మధ్యేమార్గం?
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎదుర్కొంటోన్న కీలక సమస్యల్లో ఒకటి- సీపీఎస్ రద్దు వ్యవహారం. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచీ దీనికోసం ఉద్యోగ సంఘాలు పోరాడుతూనే వస్తోన్నాయి. విజయవాడలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని కూడా నిర్వహించాయి. తాము అధికారంలోకి వస్తే- సీపీఎస్ను రద్దు చేస్తామంటూ ఇదివరకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని పట్టుబడుతున్నారు.
సీపీఎస్ రద్దు కోరుతూ ఉద్యోగులు వివిధ రూపాల్లో నిరసన ప్రదర్శనలను తెలియజేస్తూనే వస్తోన్నారు ప్రభుత్వానికి. సంతకాల సేకరణనూ చేపట్టారు. ఈ పరిస్థితుల మధ్య మరోసారి ప్రభుత్వం చర్చలకు పూనుకుంది. ఉద్యోగ సంఘాల ప్రతినిధులను ఈ సమావేశానికి ఆహ్వానించింది. ఈ సాయంత్రం 4 గంటలకు విజయవాడలో ఈ భేటీ ఏర్పాటు కానుంది. సీపీఎస్ రద్దు, దాని స్థానంలో జీపీఎస్ను అమలు చేయాలనే అంశాన్ని ప్రభుత్వం ఇదివరకే ప్రతిపాదించింది.
ఏపీఎన్జీవో, రెవెన్యూ, సచివాలయ ఉద్యోగులు, ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల సమాఖ్య, ఇతర అసోసియేషన్లకు చెందిన 20 మంది ప్రతినిధులను ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు ఇందులో పాల్గొననున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సీపీఎస్ రద్దు హామీని అమలు చేయాల్సి ఉంటుందని ఉద్యోగ సంఘాలు పట్టుబడుతున్నాయి. దీని స్థానంలో జీపీఎస్ ప్రతిపాదలను తీసుకుని రావడాన్ని తప్పుపడుతున్నాయి.
దీనిపైన ఉద్యోగ సంఘాలతో కొంతకాలంగా చర్చలు సాగుతూ వస్తోన్నాయి. ఇవ్వాళ కూడా అదే పరిస్థితి నెలకొంది. ఖజానాపై అదనపు భారం పడకుండా, ఉద్యోగులకు ఆర్థికపరంగా ఎలాంటి నష్టం కలగకుండా మధ్యేమార్గంగా జీపీఎస్ను అమలు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఉద్యోగ సంఘాలు మాత్రం సీపీఎస్ రద్దు కోసమే పట్టుబడుతున్నాయి. చాలా రోజుల తరువాత సీపీఎస్పై ప్రభుత్వం సమావేశం నిర్వహిస్తోన్నందు వల్ల దీనిపైనే అందరి దృష్టి నిలిచింది. మరోసారి జీపీఎస్ను అంగీకరించాలని విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది.
సీనియర్ ఐఎఎస్ ఆఫీసర్ను భలేగా ఆకట్టుకున్న ఫొటో: పిక్ ఆఫ్ ది డే