ఏపీలో కరోనా కేసుల మోత: ఇండియా రికార్డుల్లో ముందువరుసలో, ఆ 3 జిల్లాల్లో అత్యధికం
న్యూఢిల్లీ/అమరావతి: భారతదేశంలో ఒక్కరోజులో దాదాపు 50వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతకంతకూ పెరుగుతున్న కేసులే కారణమవడం గమనార్హం. ఏపీలో గురువారం ఒక్కరోజే దాదాపు 8వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఆ రెండు దేశాల తర్వాత ఇండియానే.. అక్కడ తగ్గుతున్నా..
దేశంలో గురువారం ఒక్కరోజే 49,310 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఒడిశా నుంచి ఇందులో వెయ్యి కేసులున్నాయి. అమెరికా, బ్రెజిల్ తర్వాత మనదేశంలోనే ఎక్కువగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. గత వారం రోజులుగా బ్రెజిల్లో నమోదవుతున్న కేసులు తగ్గుతుండగా.. మనదేశంలో మాత్రం పెరిగిపోతున్నాయి. ఇప్పుడు ఒక్కరోజులోనే దాదాపు 50వేల కేసులు నమోదవుతుండటం ఆందోళనకర విషయంగా మారింది.
ఏపీతోపాటు ఈ రాష్ట్రాల్లో అధికంగా కేసులు
ఆంధ్రప్రదేశ్ తోపాటు మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో నమోదవుతున్న కేసులతో దేశంలో భారీగా కేసుల సంఖ్య పెరిగిపోతోంది. మహారాష్ట్రలో తరచుగా దాదాపు 8వేల కేసులు నమోదవుతున్నాయి. గురువారం రోజున మహారాష్ట్రలో దాదాపు 10వేల కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం.
ఏపీ కంటే కర్ణాటక బెటర్...
తమిళనాడులో కూడా కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. ఈ రాష్ట్రంలో తరచుగా 4500కుపైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. కాగా, బుధవారం 5800 కొత్త కేసులు నమోదు కాగా, గురువారం 6400 కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో కూడా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గురువారం కర్ణాటకలో 5000ల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పోల్చుకుంటే కర్ణాటకలో కేసులు తక్కువగానే నమోదవుతున్నాయి.
Recommended Video
ఏపీలోని ఆ మూడు జిల్లాల్లోనే అత్యధికంగా కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి, గుంటూరు, అనంతపురం ఈ మూడు జిల్లాల్లోనే గురువారం రోజున 1000కి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవడం గమనార్హం. తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటి వరకు 10వేలకుపైగా కరోనా బాధితులున్నారు. గురువారంనాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 72,700 కరోనా పాజిటివ్ కేసులున్నాయి. పెరుగుతున్న కేసులను పరిశీలిస్తే త్వరలోనే కర్ణాటక(81000)ను దాటివేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఏపీలో కరోనా వృద్ధిరేటు 9.7 శాతం ఉండగా, కర్ణాటకది 6.68 శాతమే ఉండటం గమనార్హం. ఇక భారత కరోనా వృద్ధిరేటు 3.62 శాతం ఉంంది.